జైపూర్: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ సూచించిన రాజస్థాన్ హైకోర్టు జడ్జి నెమళ్ల విషయంలో ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. నెమళ్లు బ్రాహ్మచారులు కావడం వల్లే వాటిని జాతీయపక్షిగా ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. ‘మగ నెమలి బ్రాహ్మచారిగా ఉంటుంది. ఆడ నెమలితో అది శృంగారాన్ని నెరుపదు. మగ నెమలి కన్నీళ్లు తాగడం ద్వారా ఆడ నెమలి గర్భం దాలుస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు నెమలిపింఛాన్ని తన తలపై ధరించారు’ అని ఆయన పేర్కొన్నారు. నెమలి తరహాలోనే ఆవు కూడా పవిత్రమైనదని జస్టిస్ మహేష్ చంద్ర శర్మ తెలిపారు.
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, ఆవును చంపినవారికి జీవితఖైదు శిక్ష విధించాలని అంతకుముందు జస్టిస్ శర్మ తీర్పునిచ్చారు. ఈ తీర్పు గురించి మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేపాల్ ఇప్పటికే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించిందని, భారత్ కూడా ఆత్మపరిశీలన చేసుకొని ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆయన కోరారు. దీనితో లౌకికవాదానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.