న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ వద్ద ఉన్న డబ్బులు మార్చుకోవడానికి బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్న ప్రజలు సహనం కోల్పోయి గొడవలకు దిగుతుండగా.. పలుచోట్ల ఖాకీలు పేట్రేగిపోయి లాఠీలు ఝళిపిస్తున్నారు. కరెన్సీ కష్టాలకు సంబంధించి పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అవి ఇవి..
ఢిల్లీలో మహిళలు..
నోట్ల రద్దుతో తమ దగ్గర ఉన్న కరెన్సీ మార్చుకునేందుకు ఢిల్లీలోని ఓ బ్యాంకు ముందు మహిళలు, ప్రజలు పెద్దసంఖ్యలో క్యూలైన్లో నిలుచున్నారు. కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఈ సమయంలో ఓ మహిళ మధ్యలో వచ్చి నిలబడింది. అంతే వెనుక ఉన్న మహిళ సహనం కోల్పోయి దూషించింది. ఇద్దరు మధ్య మాట మాట పెరిగి చివరకు సిగపట్లు పట్టుకుని ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. పక్కనున్న వారు ఎంత ఆపినా ఆగలేదు. చిరవకు పోలీసులు రంగంలోకి దిగితే కానీ పరిస్థితి చక్కబడలేదు.
పంజాబ్లో..
నగదు మార్పిడి కోసం ఉదయం నుంచి ప్రజలు బ్యాంకు ముందు నిల్చున్నారు. చాంతాడంత క్యూలైన్ ఉంది. ఇక ఇక్కడే అసలు గలాటా మొదలైంది. నేను ముందొచ్చానంటే...నేను ముందొచ్చానంటూ ఇద్దరు మహిళలు ఫైటింగ్కు దిగారు. ఢిల్లీలో జరిగిన ఘటనలాగే సిగపట్లు పట్టుకొని కొట్టుకున్నారు.
మధ్యప్రదేశ్లో
మధ్య ప్రదేశ్లో ఓ ఏటీఎం ముందు కరెన్సీ కోసం నిలబడ్డ కొంతమంది కుర్రాళ్లు సహనం కోల్పోయారు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే సమయంలో రెండు గ్రూపులకు చెందిన కుర్రాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇంకేముంది ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలకు దిగారు. ముఖాలపై పంచ్లు విసురుకున్నారు. కర్రలకు కూడా పని చెప్పారు. పరిస్థితి చేయిదాటి పోవడంతో ఎంటరైన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కుర్రాళ్లను అక్కడి నుంచి చెదరగొట్టారు.
పంజాబ్లో ఇంకో ఘటన
పంజాబ్లో ఓ ఏటీఎం ముందు ఇద్దరు వ్యక్తులు గొడవకు దిగి చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. స్థానికులు ఎంతా ఆపినా ఆగకుండా ఘర్షణ పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతవరణం ఏర్పడింది.
సినిమా ఫైటింగ్ను తలపించేలా..
ఇక వీటన్నిటినీ తలదన్నేలా...సినిమా ఫైటింగ్ను తలపించేలా కాన్పూర్లో ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఇది బ్యాంకులు, ఏటీఎంల ముందు కాదు. పెట్రోల్ పంప్లో జరిగింది. నోట్ల రద్దు తరువాత పెట్రోల్ బంకుల్లో పాత నోట్లు చెల్లుతాయని కేంద్రం ప్రకటించింది. దీంతో పెట్రోల్ బంకు ముందు జనం బారులు తీరారు. ఇంతలో పెద్దనోట్లు ఇస్తే పెట్రోల్ పోయమని బంక్ సిబ్బంది తేల్చి చెప్పారు. ఎందుకు తీసుకోరంటూ వినియోగదారులు గొడవకు దిగాడు. దీంతో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి రక్తాలు కారేలా కొట్టుకున్నారు.