ఆ సీడీలతో నన్ను బ్లాక్‌మెయిల్‌ చేశాడు!

6 Sep, 2016 11:02 IST|Sakshi
ఆ సీడీలతో నన్ను బ్లాక్‌మెయిల్‌ చేశాడు!

న్యూఢిల్లీ: ఆప్ బహిష్కృత నేత, ఢిల్లీ మాజీ మంత్రి సందీప్ కుమార్ అశ్లీల సీడీల కేసులో మరో కీలక విషయం వెలుగుచూసింది. ఈ సీడీలను చూపించి తనను తన వ్యక్తిగత కార్యదర్శి బ్లాక్‌మెయిల్‌ చేశారని ఆయన పోలీసులకు తెలిపినట్టు సమాచారం.

గతంలో సందీప్‌కుమార్‌ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్‌ ఈ సీడీలను లీక్ చేసి చాలామందికి పంచిపెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సోమవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా, సీడీల లీకేజీ వెనుక ప్రవీణ్ హస్తముందని, ఈ సీడీల వ్యవహారంలో అతను తనను బ్లాక్‌మెయిల్‌ చేశాడని నిందితుడు సందీప్‌ పోలీసులకు తెలిపినట్టు సమాచారం. ఆయన ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు.  

సందీప్‌కుమార్‌ ఇద్దరు మహిళలతో రాసలీలలు గడుపుతున్న రెండు వేర్వేరు సీడీలు వెలుగుచూడటంతో ఆయనను పార్టీ నుంచి, మంత్రి పదవి నుంచి ఆప్‌ అధినేత కేజ్రీవాల్ తొలగించిన సంగతి తెలిసిందే. ఈ సీడీలో మంత్రితో కలసి ఉన్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 11 నెలల క్రితం రేషన్ కార్డు కోసం వెళితే సందీప్ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, తాను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఢిల్లీ పోలీసులు సందీప్పై అత్యాచారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సందీప్ను కోర్టు మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది.
 

మరిన్ని వార్తలు