ముంబై / హైదరాబాద్: కమీషన్ పెంపు వ్యవహరంపై ఆయిల్ కంపెనీలకు, పెట్రోల్ బంక్ డీలర్లకు మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు పరిష్కారం అయింది. ఆయిల్ అమ్మకాలపై వచ్చే కమీషన్ ను పెంచడానికి కంపెనీలు అంగీకరించడంతో పెట్రోల్ బంక్ ల డీలర్లు ఆందోళనలను విరమించేందుకు రంగం సిద్ధమైంది. ఒక లీటరు ఆయిల్ పై పెట్రోల్ బంకుల డీలర్లకు లభించే కమీషన్ ను మరో 10 పైసలు పెంచేందుకు ఆయిల్ కంపెనీలు అంగీకరించాయి.
ముంబైలో డీలర్లకు, ఆయిల్ కంపెనీలకు మధ్య శుక్రవారం జరిగిన చర్చలు సఫలం కావడంతో ఇండియన్ పెట్రోల్ బంక్ డీలర్ల కన్సార్టియం (సీఐపీడీ) తన కార్యాచరణను ఉపసంహరించుకోనుంది. అంతకుముందు.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే మాత్రమే బంక్ లు తెరిచి ఉంచుడం, ప్రభుత్వ సెలవు దినాల్లోనూ బంకులు మూసివేడంలాంటి తీవ్ర నిర్ణయాలను సీఐపీడీ ప్రకటించింది. దీంతో హైదరాబాద్ కు చెందిన డీటర్లు కూడా ఆ నిర్ణయాలను అమలుచేయనున్నట్లు శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ఇది జరిగిన కొద్ది సేపటికే ముంబైలో చర్చలు సఫలం అయినట్లు సమాచారం అందింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పినట్లయింది.