రన్‌వేపై పేలిన విమానం టైరు

17 Aug, 2015 23:57 IST|Sakshi

చెన్నై(టీనగర్): చెన్నై విమానాశ్రయంలో సోమవారం అండమాన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం వెనుక టైర్ పేలడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చెన్నై నుంచి అండమాన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం సోమవారం ఉదయం 11.10 గంటలకు డొమెస్టిక్ టెర్మినల్ నుంచి బయలుదేరింది. విమానంలో 77 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు.

రన్‌వేపై వెళుతుండగా హఠాత్తుగా విమానం వెనుక టైరు భారీ శబ్దంతో పేలిపోయింది. భీతిల్లిన ప్రయాణికులు బిగ్గరగా కేకలు వేశారు. పెలైట్ చాకచక్యంగా అదుపులోకి తీసుకుని రన్‌వేపై నిలిపివేశారు. వెంటనే భద్రతా అధికారులు, విమానాశ్రయ ఉన్నతాధికారులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రయాణికులను వరుసగా కిందికి దింపారు. ఎవరికీ ఏమీ కాలేదు. విమానాశ్రయంలో వారికి బస కల్పించారు. విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది విచారణ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు