బీటెక్ స్టూడెంట్ కిడ్నాప్, హత్య..

31 Oct, 2016 22:34 IST|Sakshi
బీటెక్ స్టూడెంట్ కిడ్నాప్, హత్య..

విశాఖపట్నం: నాలుగు రోజుల కిందట కిడ్నాపైన ఇంజనీరింగ్ విద్యార్థి శవమై కనిపించిన సంఘటన విశాఖపట్నం జిల్లాలో కలకలంరేపుతోంది. మాకవరంపాలెంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోన్న ప్రదీప్.. సోమవారం సాయంత్రం అనకాపల్లిలోని శారద నది తీరంలో విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కు పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమ వ్యవహారమే ప్రదీప్ హత్యకు కారణమని స్నేహితులు చెబుతుండగా, తల్లిదండ్రులు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..

మాకవరంపాలెంలోని అవంతి కాలేజీకి చెందిన బీటెక్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ ప్రదీప్ ను ఈ నెల 28న గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. అదే కాలేజీలో బీటెక్ సెకండ్ ఇంయర్ చదువుతోన్నఅమ్మాయితోపాటు కశింకోట వద్ద బస్సు దిగిన ప్రదీప్.. ఆమెతో కలిసి చాట్ తింటుండగా కిడ్నాప్ ఘటన జరిగింది. విషయం తెలిసిన వెంటనే ప్రదీప్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈలోగా..

అనకాపల్లి సమీపంలోని శారద నదిలో సోమవారం సాయంత్రం ప్రదీప్ మృతదేహం లభ్యమైంది. నది వద్దకు చేరుకున్న పోలీసులు ప్రదీప్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్ మార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి ప్రదీప్ తల్లిదండ్రులు, బంధువులతోపాటు స్నేహితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొన్నేళ్లుగా ప్రదీప్ కు, అతని క్లాస్ మేట్ కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఆ కారణం వల్లే హత్య జరిగి ఉండొచ్చని మృతుడి స్నేహితులు పేర్కొన్నారు. హత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ప్రదీప్ బంధువులు సైతం హత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

మరిన్ని వార్తలు