న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం(84) ఆకస్మిక మృతి దేశానికి తీరని లోటని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి అబ్దుల్ కలాం అనితర సేవలు అందించారని ప్రణబ్ తెలిపారు. అటు శాస్త్రవేత్తగా, ఇటు పరిపాలకుడిగా కలాం దేశానికి మహోన్నతమైన సేవలు అందించారని కొనియాడారు. అబ్దుల్ కలాం అప్పుడూ-ఎప్పుడూ ప్రజల రాష్ట్రపతిగానే నిలిచిపోతారని ప్రణబ్ తన గౌరవ సంతాపంలో పేర్కొన్నారు.
అబ్దుల్ కలాం సోమవారం సాయంత్రం 6.40 గంటలకు కన్నుమూశారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఐఐఎంలో జరిగే సెమినార్లో ప్రసంగించేందుకు వెళ్లిన ఆయన.. అక్కడే వేదికపై తీవ్ర అస్వస్థతతో కుప్పకూలారు. ఆయనను అక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలోని బెథనీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.