పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని తమ పూర్వీకుల ఇంటికి వెళ్లడానికి బయల్దేరిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పై-లీన్ తుఫాను నేపథ్యంలో తన పర్యటనను అర్ధాంతరంగా రద్దుచేసుకున్నారు. బెంగాల్కు పొరుగు రాష్ట్రమైన ఒడిషాను తుఫాను తీవ్రంగా తాకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆయన తిరిగి ఢిల్లీ బయల్దేరాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిరాటీ సమీపంలోని కిర్నహార్ గ్రామం నుంచి సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ రోడ్డుమార్గంలో బయల్దేరుతారని అధికారవర్గాలు తెలిపాయి. కారులో ఆయన పానాగఢ్ చేరుకుని, అక్కడింనుంచి విమానమార్గంలో న్యూఢిల్లీ వెళ్తారు. వాస్తవానికి దుర్గాపూజ కోసం తన పూర్వీకుల గ్రామానికి రాష్ట్రపతి చేరుకున్నారు. ప్రణబ్ రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత దుర్గాపూజకు రావడం ఇది రెండోసారి.