పంజాబ్‌లో రైతు రుణమాఫీ

20 Jun, 2017 02:35 IST|Sakshi

సన్న, చిన్నకారు రైతులకు రూ. 2 లక్షల వరకూ మాఫీ

చండీగఢ్‌: ఎన్నికల హామీ మేరకు పంజాబ్‌ రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రకటించారు. రుణమాఫీలో భాగంగా సన్న, చిన్నకారు రైతులకు(5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు) రూ. 2 లక్షల వరకూ రుణమాఫీ చేస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు తీసుకున్న రుణాల్ని కూడా ప్రభుత్వమే చెల్లించడంతో పాటు.. వారి కుటుంబాలకు నష్టపరిహారాన్ని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు.

 సోమవారం అసెంబ్లీలో అమరీందర్‌ ప్రకటన చేస్తూ.. ప్రభుత్వ నిర్ణయంతో 10.25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని, ఇందులో 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూములున్న రైతులు 8.75 లక్షలు ఉన్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రకటించిన రుణమాఫీ కంటే రెండింతలు మాఫీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రముఖ ఆర్థిక వేత్త టీ హక్యూ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.

ప్రైవేట్‌ రుణాల మాఫీపై సబ్‌ కమిటీ
రైతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న రుణాల మాఫీ కోసం ‘పంజాబ్‌ వ్యవసాయ రుణాల ఒప్పందం 2016’ను సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కేబినెట్‌ సబ్‌ కమిటీకి ఆ పని అప్పగించామని అమరీందర్‌ చెప్పారు. రైతుల బలవన్మరణాలకు కారణాలు తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేస్తే మంచిదని స్పీకర్‌కు సూచించారు.

మరిన్ని వార్తలు