పంజాబ్‌లో ఆటవికం

10 Jun, 2017 18:48 IST|Sakshi
పంజాబ్‌లో ఆటవికం

డ్రగ్స్‌ అమ్మాడని కాళ్లు, చేయి నరికేశారు

బటిండా: మత్తుపదార్ధాలు విక్రయిస్తున్నాడని ఆరోపిస్తూ 30ఏళ్ల ఓ వ్యక్తిని ఆటవికంగా కాళ్లు, చేయి నరికి చంపిన దారుణ ఘటన పంజాబ్‌లో జరిగింది. పంజాబ్‌లోని బటిండా జిల్లాలోని భగీ వందర్‌ గ్రామంలో గురువారం ఓ అల్లరిమూక ఈ దారుణానికి పాల్పడింది. రక్తమోడుతున్న అతడిని రక్షించడానికి ఎవరూ ముందుకు రాలేదు. డ్రగ్స్‌ అమ్ముతున్నాడన్న ఆరోపణలపై అరెస్టయిన వినోద్‌ కుమార్‌ నాలుగు రోజుల క్రితం జైలు నుంచి బయటికొచ్చాడు. గురువారం కొందరు వినోద్‌తో వాదనకు దిగి చితకబాదారు. తర్వాత పదునైన ఆయుధంతో కాళ్లు, చేయి నరికేశారు.

రక్తసిక్తమైన అతడిని కాపాడేందుకు ఎవరూ ధైర్యంచేయలేదు. ఈ దారుణాన్ని కొందరు మొబైళ్లలో వీడియోలు తీశారు. తర్వాత వినోద్‌ను తల్వాండి సాబూ ఆస్పత్రికి అక్కడి నుంచి ఫరీద్‌కోట్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన వినోద్‌ అక్కడే కన్నుమూశాడు. మొబైల్‌ వీడియోలను పరిశీలించి స్థానికుల గుంపుపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనానికి గురైన స్కూటర్‌ కోసం ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుండగా కిడ్నాప్‌ చేసి చంపేశారని వినోద్‌ తల్లిదండ్రులు ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు