ఆ ట్వీట్‌పై క్రికెటర్ల భార్యల స్పందన!

12 Oct, 2016 13:02 IST|Sakshi
అశ్విన్‌ భార్య ప్రితీ అశ్విన్‌, సెహ్వాగ్‌ భార్య ఆర్తి

న్యూఢిల్లీ: మూడో టెస్టులో న్యూజిల్యాండ్‌పై విజయం సాధించి సిరీస్‌ను 0-3తో కైవసం చేసుకున్న భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మూడో టెస్టులోనూ అద్భుతంగా రాణించి 13 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్‌ అశ్విన్‌ మ్యాన్‌ ఆఫ్‌ మ్యాచ్‌ గెలిచాడు. అంతేకాకుండా తన కెరీర్‌లో ఏడోసారి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అశ్విన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూనే మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన స్టైల్‌ పంచ్‌ డైలాగ్‌ విసిరాడు.

’అద్భుతంగా ఆడి ఏడోసారి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ గెలుచుకున్న అశ్విన్‌కు అభినందనలు. ఇంటికి వెళ్లాల్సిన తొందరమేమిటో కేవలం పెళ్లయిన వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది’  అని సెహ్వాగ్‌ చమత్కరించాడు. ఇందుకు అశ్విన్‌ కృతజ్ఞతలు చెప్పగా.. అశ్విన్‌ భార్య ప్రితీ అశ్విన్‌ స్పందిస్తూ.. ‘హాహాహా.. నేనేం చేయనండి’ అంటూ బదులిచ్చింది. ఈ మధ్య ట్విట్టర్‌లో అడుగుపెట్టిన సెహ్వాగ్‌ భార్య ఆర్తి కూడా ఈ సంభాషణలోకి దిగుతూ.. ‘నేను కూడా ఏం చేయను ప్రితీ.. కానీ వాళ్లిద్దరికే (అశ్విన్‌, సెహ్వాగ్‌) ఎప్పుడూ తొందరెక్కువ’ అంటూ కామెంట్‌ చేసింది. మొత్తానికి ఈ ఫన్నీ సంభాషణ నెటిజన్లను భలే మురిపిస్తున్నది. 

మరిన్ని వార్తలు