రాహుల్‌.. బహిరంగంగా క్షమాపణ చెప్పు!

25 Aug, 2016 16:03 IST|Sakshi
రాహుల్‌.. బహిరంగంగా క్షమాపణ చెప్పు!

న్యూఢిల్లీ: 'మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్సే కారణమన్న తన వ్యాఖ్యలకు రాహుల్‌గాంధీ బహిరంగంగా తప్పు ఒప్పుకోవాలి. ఈ విషయంలో వాస్తవాలను వక్రీకరించినందుకు ఆయన కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే' అని ఆరెస్సెస్‌ డిమాండ్‌ చేసింది.

మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్సే కారణమంటూ 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలో  కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆరెస్సెస్ కార్యకర్త ఒకరు ఆయనపై పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో గాంధీ హత్యకు ఆరెస్సెస్‌ కారణం కాదని, ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న వ్యక్తి జాతిపితను కాల్చిచంపారని తాజాగా రాహుల్‌ కోర్టుకు వివరణ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో బీజేపీ మాతృసంస్థ అయిన ఆరెస్సెస్‌ ప్రధాన ప్రతినిధి ఎంజీ వైద్యా ఏఎన్‌ఐ న్యూస్‌ ఏజెన్సీతో మాట్లాడారు. 'గాంధీజీ హత్యకు ఆరెస్సెస్‌ కారణం కాదని, ఆ సంస్థతో అనుబంధమున్న వ్యక్తే ఆయనను చంపారని రాహుల్‌ తాజాగా పేర్కొంటున్నారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్‌ పూర్తిగా వివరణ ఇవ్వాలి. ఏ రకంగా ఆ వ్యక్తి ఆరెస్సెస్‌తో అనుబంధమున్న వాడు, సంస్థలో అతని పాత్ర ఏమిటో కూడా రాహుల్‌ చెప్పాలి' అని పేర్కొన్నారు. ఈ విషయంలో రాహుల్ తప్పు చేశారని, ఆయన తన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సిందేనని ఎంజీ వైద్యా అన్నారు.

మరిన్ని వార్తలు