హోం మంత్రి షిండేపై సోనియా ఆగ్రహం?

29 Oct, 2013 17:42 IST|Sakshi
హోం మంత్రి షిండేపై సోనియా ఆగ్రహం?
పాట్నాలో వరుస పేలుళ్ల సంఘటన తర్వాత బాలీవుడ్ చిత్రానికి సంబంధించిన ఆడియో కార్యక్రమానికి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే హాజరవ్వడం వివాదస్పదమైంది. ఆడియో కార్యక్రమానికి షిండే హాజరుకావడంపై బీజేపీ మండిపడింది. ప్రభుత్వ వ్యవహారాల కన్నా కేంద్ర మంత్రులకు ఇతర కార్యక్రమాలపై మోజు ఉందని బీజేపీ ఆరోపించింది. 
 
అయితే ఆడియో విడుదల కార్యక్రమానికి షిండే హాజరవ్వడంపై యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సోనియాగాంధీతో షిండే సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సోనియాగాంధీతో షిండే సమావేశంలో 10 జన్ పథ్ లో సుమారు 20 నిమిషాలపాటు సాగిందని.. వివారాలు ఇంకా బయటకు పొక్కలేదని తెలుస్తోంది. 
 
బాలీవుడ్ తార కంగనా రనౌత్ నటించిన 'రజ్జో' చిత్రం ఆడియో కార్యక్రమం ముంబైలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి షిండే హాజరయ్యారు. ఆదివారం పాట్నాలో నరేంద్ర మోడీ పాల్గొన్న సభలో వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. గతంలో ఢిల్లీలో పేలుళ్లు జరిగినప్పడు అప్పటి కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ దుస్తులు మార్చుకోవడం కూడా వివాదస్పదమైన సంగతి తెలిసిందే. 
మరిన్ని వార్తలు