సంబరాలకు దూరంగా రాజ్‌నాథ్‌..!

12 Mar, 2017 23:50 IST|Sakshi
సంబరాలకు దూరంగా రాజ్‌నాథ్‌..!

న్యూఢిల్లీ/రాయ్‌పూర్‌: ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ నేతలంతా సంబరాల్లో మునిగిఉండగా కేంద్ర హోం శాఖ మంత్రి, ఆ పార్టీ నాయకుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ మాత్రం అందుకు దూరంగా ఉన్నారు. ఇందుకు కారణం  చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో 12 మంది సిఆర్‌పీఫ్‌ జావానులు మృతిచెందడమేనని ఆయన చెప్పారు.

శనివారం ఉదయం గం 9.15 సమయంలో కొత్తచెరువు గ్రామంలోని బేజి పోలీసు స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు మెరుపుదాడి జరిపి సీఆర్‌పీఎఫ్, 219వ బెటాలియన్‌పై మెరుపుదాడి చేయడం తెలిసిందే. కు చెందిన 12 మందిని కాల్చిచంపి వారి దగ్గర ఉన్న ఆయుధాలను దొంగిలించిన సంగతి తెలిసిందే. దీనినిపిరికి చర్యఅని వర్ణిస్తూ.. జవానుల త్యాగాలు వృధా కాబోవన్నారు.

మావోల దాడి వ్యూహాత్మకమే : పోలీసులు
ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై పక్కా ప్రణాళికతోనే దాడి జరిగినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. వ్యూహాత్మకంగా తమ టార్గెట్‌ను పరిధిలోకి రానిచ్చిన మావోలు మందుపాతరలు పేల్చారనీ, దేశీయంగా తయారైన మోర్టార్లను వినియోగించారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో హాలీవుడ్‌ చిత్రం ‘రాంబో’ తరహాలో బాణాలకు చివర పేలుడు పదార్థాలు కట్టి దాడికి తెగబడ్డారని అన్నారు. బస్తర్‌ జిల్లాలోని నారాయణపూర్, కొండాగావ్‌ క్యాంపులపై మావోయిస్టులు ఇలాగే బాంబులున్న బాణాలతో విరుచుకుపడ్డారని అధికారులు తెలిపారు. సీఆర్‌పీఎఫ్‌ 219వ బెటాలియన్‌కు చెందిన 112 మంది జవాన్లు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు నిర్మాణంలో ఉన్న భెజ్జీ–ఇంజ్రమ్‌ రోడ్డు మార్గాన్ని పహారా కాసేందుకు బయల్దేరారు. పహారాతోపాటు భెజ్జీలో ప్రతి శనివారం జరిగే మార్కెట్‌ స్థలాన్ని జవాన్లే సిద్ధం చేయాలి.

ఈ క్రమంలో వారి కదలికలను మావోయిస్టులు పసిగట్టారు. జవాన్లు ఉదయం 8.50 గంటలకు కొత్తచెరు ప్రాంతానికి చేరుకోగానే అక్కడే నక్కిఉన్న మావోలు మందుపాతరలు పేల్చడమే కాకుండా తూటాలవర్షం కురిపించారు. ఈ దాడిలో 12 మంది జవాన్లు చనిపోయారు. గత ఏడాదిన్నరలో మావోలు చేసిన అతి పెద్దదాడి ఇదేనని పోలీసులు తెలిపారు. మావోలు మార్చి, జూన్‌ మాసాల్లో వ్యూహాత్మక ఎదురుదాడి కార్యక్రమాన్ని(టీసీఓసీ) పాటిస్తారు. చెట్లన్నీ ఎండిపోయి భద్రతా బలగాల కదలికలు స్పష్టంగా కనిపించడం వల్లే వారు టీసీఓసీని పాటిస్తారని పోలీసు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు