అన్నయ్యా.. చరిత్ర ఎవ్వరినీ క్షమించదు!

17 Oct, 2016 14:04 IST|Sakshi
అన్నయ్యా.. చరిత్ర ఎవ్వరినీ క్షమించదు!

- ఎన్నికల్లో 100 సీట్లైనా గెలవకుంటే బాధ్యుడివి నువ్వే
- ఎస్పీ చీఫ్ ములాయంకు తమ్ముడు రాంగోపాల్ ఘాటులేఖ


లక్నో:
'అన్నయ్యా.. కొడుకును కాదని నీకు ప్రీతిపాత్రుడైన తమ్ముణ్ణి(శివపాల్ యాదవ్ను)వెనకేసుకొస్తున్నావ్. మంచిది. వచ్చే ఎన్నికల్లో మన పార్టీ కనీసం 100 సీట్లు కూడా గెలుచుకోలేకపోతే దానికి బాధ్యుడివి నువ్వే. ఇంత చేస్తున్న నువ్వు అసలు చరిత్రను ఒక్కసారైనా పరికించావా? చరిత్ర.. చాలా క్రూరమైనది. ఏ ఒక్కరినీ క్షమించదు' అంటూ సమాజ్ వాది పార్టీ ముఖ్యనేత రాంగోపాల్ యాదవ్.. తన పెద్దన్న, పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కు శనివారం ఘాటు లేఖ రాశారు. 2017 ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సీఎం అభ్యర్థి కాబోడంటూ ఇటీవల ములాయం చేసిన వ్యాఖ్యలపై రాంగోపాల్ యాదవ్ తీవ్రంగా స్పందించారు.

చాలా కాలంగా కొడుకు అఖిలేష్, తమ్ముడు శివపాల్ ల మధ్య నడుస్తోన్న ఆధిపత్య పోరును సమం చేయాలని ములాయం భావిస్తున్నారని, ఆ క్రమంలో పెద్దాయన తమ్ముడివైపు మొగ్గుతున్నారని రాంగోపాల్ యాదవ్ తన లేఖలో ఆక్షేపించారు. తన అద్భుతమైన పరిపాలనతో సీఎం అఖిలేష్ యూపీ ప్రజల మన్ననలు పొందారని, 2017 ఎన్నికల్లోనూ అఖిలేష్ నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని, లేకుంటే దారుణమైన ఫలితాలు చవిచూడాల్సి వస్తుందని రాంగోపాల్ అభిప్రాయపడ్డారు.

మొదటి నుంచి సోదరుడు శివపాల్ యాదవ్ ను వ్యతిరేకిస్తోన్న రాంగోపాల్ యాదవ్.. ఆధిపత్య పోరులో సీఎం అఖిలేష్ పక్షాన నిలబడ్డారు. ప్రస్తుతం అఖిలేష్ టీంలో ప్రధాన వ్యూహకర్త రాంగోపాలే. ఆధిపత్యం కోసం ఇప్పటిదాకా జరిగిన పోరులో అఖిలేష్ వర్గం ఏనాడూ పార్టీ సుప్రీం ములాయంను నేరుగా విమర్శించలేదు. ఇప్పుడా కొరత తీర్చుతూ రాంగోపాల్.. ములాయంపై ఘాటులేఖాస్త్రాన్ని సంధించారు. దీనిపై వైరిపక్షం స్పందించాల్సిఉంది.

>
మరిన్ని వార్తలు