ఏపీలో ఓట్లన్నీ కోవింద్‌కే, ఆధిక్యమెంత!?

20 Jul, 2017 14:37 IST|Sakshi
ఏపీలో ఓట్లన్నీ కోవింద్‌కే, ఆధిక్యమెంత!?

రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్, యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్‌ తలపడ్డ ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటలకు మొదలైంది. తొలుత పార్లమెంటు హౌస్‌లో ఏర్పాటుచేసిన బ్యాలెట్‌ బాక్సును లెక్కిస్తున్నారు. మొదట ఎంపీల ఓట్లను లెక్కించిన అనంతరం రాష్ట్రాల నుంచి వచ్చిన బాక్సులను ఆంగ్ల వర్ణమాల క్రమంలో లెక్కిస్తున్నారు.

ఇందులో భాగంగా తొలిరౌండ్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, ఆంధ్రప్రదేశ్‌ బ్యాలెట్‌ బాక్సుల కౌంటింగ్‌ పూర్తయింది.  రామ్‌నాథ్‌కు 4,79,585, మీరాకుమార్‌కు 2,04,594 ఓట్లు విలువ రాగా, ఏపీలో మాత్రం రామ్‌నాథ్‌కే ఓట్లన్నీ పోలయ్యాయి.  మొత్తం నాలుగు టేబుళ్లపై 8 రౌండ్ల పాటు కౌంటింగ్‌ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకల్లా ఫలితాలు ప్రకటించే అవకాశముంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్ గెలుపు ఖాయమని వినిపిస్తోంది. ఎన్టీయేకు సంపూర్ణ మెజారిటీ ఉండటంతో కోవింద్‌ సునాయసంగా రాష్ట్రపతి కాబోతున్నారని తెలుస్తోంది. 776 మంది ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలతో మొత్తం 4,895మంది అర్హులైన ప్రజాప్రతినిధుల్లో 99శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.  రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇది రికార్డు పోలింగ్‌. ఈ పోలింగ్‌లో ఎన్డీయే అభ్యర్థి కోవింద్‌కు ఎంత ఆధిక్యం వస్తుందన్న దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. కోవింద్‌కు దాదాపు 70శాతం ఓట్లు లభించవచ్చునని భావిస్తున్నారు. ఏదైనా అద్భుతం, అనూహ్యం జరిగితే ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌ విజయం సాధించవచ్చునని అంటున్నారు.

మరిన్ని వార్తలు