ఔనా! నిజమా! కేరళ సీఎం పన్నీర్‌ సెల్వం!

24 Jan, 2017 12:43 IST|Sakshi
ఔనా! నిజమా! కేరళ సీఎం పన్నీర్‌ సెల్వం!

'కేరళ ముఖ్యమంత్రి శ్రీ పన్నీర్‌ సెల్వం, ఆయన అధికార బృందంతో  భేటీ అయ్యాను' అంటూ ఏకంగా కేంద్రమంత్రి ట్వీట్‌ చేయడంతో నెటిజన్లు బిత్తరపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి, జయలలిత వీరవిధేయుడైన పన్నీర్‌ సెల్వం కేరళకు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారంటూ తికమకపడ్డారు. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారు వ్యవహారాల మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ ఇలా పొరపాటున ట్వీట్‌ చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ ఆయనను కలువగా.. పాశ్వాన్‌ మాత్రం తనను కలిసింది కేరళ సీఎం పన్నీర్‌సెల్వం అంటూ పోస్టు చేశారు.

కేంద్రమంత్రి అయి ఉండి ఆయన ఇలా పొరపాటు చేయడంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. పాశ్వాన్‌ రాహుల్‌ గాంధీతో పోటీపడుతున్నారా? అంటూ సెటైర్లు వేశారు. తాను స్వయంగా ఎవర్ని కలిసింది కూడా ఆయనకు తెలియకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఈ క్రమంలో పొరపాటును గుర్తించిన పాశ్వాన్‌ పాత ట్వీట్‌ను డిలీట్‌ చేసి.. కేరళ సీఎం పినరయి విజయన్‌ అంటూ కరెక్ట్‌ పోస్టుపెట్టారు.

>
మరిన్ని వార్తలు