భల్లాలదేవ ముందే జాగ్రత్త పడ్డాడట!

22 Oct, 2016 20:23 IST|Sakshi
భల్లాలదేవ ముందే జాగ్రత్త పడ్డాడట!

యంగ్ హీరో రానా, సీనియర్‌ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చిక్కుల్లో పడ్డారు. ఓ ఆన్ లైన్ గేమ్కు సంబంధించిన యాడ్ లో కనిపించినందుకు ఈ ఇద్దరిపై పోలీసు కేసు నమోదైంది. ‘బాహుబలి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా, ప్రకాష్ రాజ్తో కలిసి ‘జంగిల్ రమ్మీ’ అనే ఆన్‌లైన్‌ యాడ్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ వాణిజ్య ప్రకటన ద్వారా ఈ ఇద్దరూ గ్యాంబ్లింగ్ను ప్రోత్సహిస్తున్నారని కోయంబత్తూర్కు చెందిన ఓ సామాజిక కార్యకర్త కేసు వేశాడు.  రానా, ప్రకాశ్‌ రాజ్‌ ఈ యాడ్‌లో నటించడంపై సోషల్ మీడియాలో గతంలోనూ విమర్శలు వచ్చాయి. నైతికతలేని గ్యాంబ్లింగ్‌గా దీనిని విమర్శించినవారూ లేకపోలేదు.

అయితే, ఈ యాడ్‌ విషయంలో రానా ముందే జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తన లాయర్‌ సలహా తీసుకున్న తర్వాత ఆయన ఈ వాణిజ్య ప్రకటనలో నటించినట్టు చెప్తున్నారు. రమ్మీ అంటే గ్యాంబ్లింగ్‌ కాదని, అది నైపుణ్యానికి సంబంధించిన ఆట అని, దీని కోసం ప్రచారం చేయడం చట్టవ్యతిరేకం కాదని రానాకు లాయర్‌ చెప్పినట్టు అంటున్నారు. మొత్తానికి రానా, ప్రకాశ్‌ రాజ్‌లకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త వేసిన కేసు నిలబడదని వినిపిస్తోంది.  
 

మరిన్ని వార్తలు