కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు

11 Mar, 2014 09:51 IST|Sakshi

మహిళా బాధితురాలు ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎ.పి. అబ్దుల్లాకుట్టిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. అతడిపై పలు సెక్షన్ల కింద తిరువనంతపురంలోని కంటోన్మెంట్ వనితా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... కన్నురు ఎమ్మెల్యే అబ్దుల్లాకుట్టి నగరంలోని ఓ హోటల్లో తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ తిరువనంతపురం పోలీసులకు ఈ నెల 3వ తేదీన ఫిర్యాదు చేసింది. తనకు తరచుగా ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడటమే కాకుండా అత్యాచార విషయం బయటకు వెళ్లడిస్తే చంపేస్తానని బెదిరించాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

 

ఆ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు సోమవారం సదరు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. అబ్దుల్లాకుట్టి గతంలో సీపీఐ - ఎం పార్టీ తరపున పోటీ చేసి రెండు సార్లు పార్లమెంట్కు ఎన్నికయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి కన్నురు శాసనసభ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మార్చి 3న బాధిత మహిళ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే అబ్దుల్లా కుట్టి తోసిపుచ్చారు. మహిళ ఆరోపణలు నిరాధారమైనవని ఆయన ఖండించిన విషయం తెలిసిందే. కేరళలో సంచలనం సృష్టించిన సోలార్ స్కాంలో సదరు మహిళ నిందితురాలుగా ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు