పటుత్వ పరీక్ష చేయించుకోవాల్సిందే..

25 Feb, 2017 03:40 IST|Sakshi
పటుత్వ పరీక్ష చేయించుకోవాల్సిందే..

- ఓ భర్తకు తేల్చి చెప్పిన హైకోర్టు
- సెషన్స్‌ కోర్టు ఉత్తర్వులకు సమర్థన  


సాక్షి, హైదరాబాద్‌:
వైవాహిక జీవితంలో తలెత్తిన స్పర్థల నేపథ్యంలో తన భర్తకు లైంగిక పటుత్వ పరీక్ష నిర్వహించాలంటూ ఓ భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

తన భర్తకు లైంగిక పటుత్వం లేదని, ఈ విషయాన్ని దాచి తనను పెళ్లి చేసుకున్నారని, అనంతరం అధిక కట్నం కోసం వేధిస్తున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పటుత్వ పరీక్ష చేయించుకునేందుకు భర్త నిరాకరించడంతో పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే మేజిస్ట్రేట్‌ పోలీసుల అభ్యర్థనను తిరస్కరిస్తూ పిటిషన్‌ కొట్టేశారు. దీనిపై పోలీసులు అప్పీల్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన సెషన్స్‌ కోర్టు కింది కోర్టు ఉత్తర్వులను రద్దు చేసి పటుత్వ పరీక్ష చేయించుకోవాల్సిందేనని భర్తకు తేల్చి చెప్పింది.

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు విచారణ జరిపారు. సెషన్స్‌ కోర్టు ఉత్తర్వులను సమర్థించారు. పటుత్వ పరీక్ష చేయించుకోవడం పిటిషనర్‌ వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లు కాదంటూ రివిజన్‌ పిటిషన్‌ను కొట్టేశారు.

మరిన్ని వార్తలు