రిలయన్స్ పవర్‌కు చలసాని గుడ్‌బై

28 Sep, 2013 02:30 IST|Sakshi
రిలయన్స్ పవర్‌కు చలసాని గుడ్‌బై

 న్యూఢిల్లీ: విద్యుత్‌రంగ సంస్థ రిలయన్స్ పవర్ సీఈవో పదవికి జేపీ చలసాని రాజీనామా చేశారు. వ్యాపారవేత్తగా ఎదిగే ఉద్దేశంతో ఉన్న చలసాని ఈ ఏడాది ఆఖర్లో వైదొలుగుతారని, విదేశాలకు వెడతారని కంపెనీ..స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. ఆయన దాదాపు 18 సంవత్సరాల పాటు సంస్థలో కొనసాగారు.

ప్రభుత్వరంగ దిగ్గజం ఎన్‌టీపీసీలో చలసాని (55) కెరియర్ ప్రారంభించారు. 2005 జూన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యం రెండుగా విభజన జరిగినప్పుడు ఆయన అనిల్ అంబానీ గ్రూప్‌లో చేరారు. అనిల్ అంబానీకి సన్నిహితుడైన చలసాని.. రిలయన్స్ పవర్‌కి సంబంధించి అనేక ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్నారు. 2008 మార్చ్‌లో సంస్థ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సీఈవోగా ఉన్న సమయంలో కృష్ణపట్నం (ఆంధ్రప్రదేశ్), ససాన్ (మధ్యప్రదేశ్), తిలయా (జార్ఖండ్)లలో తలో రూ. 20,000 కోట్ల విలువ చేసే అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు మూడింటిని రిలయన్స్ పవర్ దక్కించుకుంది. అలాగే, పవర్ ప్రాజెక్టులకు కావాల్సిన పరికరాల సరఫరా కోసం చైనాకి చెందిన షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్‌తో 10 బిలియన్ డాలర్ల ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
 

మరిన్ని వార్తలు