మోదీకి లేఖ రాసిన 84ఏళ్ల వృద్ధురాలు!

29 Aug, 2016 19:20 IST|Sakshi

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 84ఏళ్ల రిటైర్డ్ టీచర్ లేఖ రాశారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రే స్వయంగా మన్ కీ బాత్ ప్రోగ్రాం ద్వారా వెల్లడించారు. తాను ఇచ్చిన 'గివ్ ఇట్ ఆప్' పిలుపుకు స్పందించిన ఆమె సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ను వదులుకుందని చెప్పారు. ఆమె లేఖలో సారాంశం ఇలా ఉంది.

దేశంలోని పేద తల్లులకు మీరు మంచి చేస్తున్నారు. కట్టెల పొయ్యి నుంచి వారికి విముక్తిని కల్పిస్తున్నారు. దేశంలోని పేద తల్లులకు పొగరాని పొయ్యిలను అందించడానికి తన వంతుగా 50వేల రూపాయల సాయం చేస్తున్నానని ఆమె తెలిపారు. కాగా లేఖపై స్పందించిన మోదీ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ఆమె గురించి ఎమోషనల్ గా మాట్లాడారు.

ఎంత డబ్బు సాయం చేశారనేది ముఖ్యం కాదని అన్నారు. పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్న ఓ తల్లి దేశంలోని సోదరుల కోసం సాయం చేయడం గొప్పతనాన్ని తెలియజేస్తుందని అన్నారు. దేశంలోని గొప్ప తల్లుల దీవెనలు తనకు ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. లేఖలో ఆమె తనను ప్రధానమంత్రి మోదీగా కాకుండా మోదీ భయ్యా అని సంభోదించారని ఉద్వేగంగా తెలిపారు.
 
ఇటువంటి సంఘటనలు దేశ ప్రజలకు ఏదైనా చేయాలనే స్ఫూర్తిని తనలో రగుల్చుతుంటాయని చెప్పారు. ఈ సందర్భంగా 'గివ్ ఇట్ అప్' పిలుపు మేరకు సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ను వదులుకున్న దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పీఎం తరఫున ఆమె ఇంటికి వెళ్లిన ప్రతినిధి ఒకరు మోదీ స్వయంగా రాసిన ఉత్తరాన్ని అందజేశారు. ఎల్పీజీ సబ్సిడీ కనెక్షన్ ను వదులుకున్నందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు