నా కొడుకు కెరీర్‌తో ఆ డైరెక్టర్స్‌ ఆడుకున్నారు!

20 Sep, 2017 16:01 IST|Sakshi
నా కొడుకు కెరీర్‌తో ఆ డైరెక్టర్స్‌ ఆడుకున్నారు!

అలనాటి బాలీవుడ్‌ కథనాయకుడు, సీనియర్‌ హీరో రిషి కపూర్‌ మరోసారి తన వ్యాఖ్యలతో కలకలం రేపాడు. తన కొడుకు రణ్‌బీర్‌ కపూర్‌ కెరీర్‌తో అనురాగ్‌ కశ్యప్‌, అనురాగ్‌ బసు ఆడుకున్నారని, రణ్‌బీర్‌ కెరీర్‌ దెబ్బతినడానికి వారే కారణమని దుమ్మెత్తిపోశాడు. నేహా ధూఫియా టాక్‌షో 'నో ఫిల్టర్‌ నేహా'లో ముచ్చటించిన ఆయన.. 'అనురాగ్‌' అన్న పదంపై ఒక నిమిషం పాటు మాట్లాడాలని కోరగా.. ఆ ఇద్దరు డైరెక్టర్లను టార్గెట్‌ చేశారు. రణ్‌బీర్‌ కపూర్‌తో అనురాగ్‌ కశ్యప్‌ తీసిన 'బొంబే వెల్వెట్‌' అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌గా అపకీర్తి ముటగట్టుకోగా.. రణ్‌బీర్‌ తొలిసారి సహనిర్మాతగా వ్యవహరించిన 'జగ్గాజాసూస్‌' సినిమాను అనురాగ్‌ బసు తెరకెక్కించాడు.

'అనురాగ్‌ కశ్యప్‌ 'బొంబే వెల్వెట్‌' తీశాడు. అంతకుముందు అతను తీసిన 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ వస్సీపూర్‌' మంచి సినిమా. కానీ అతను తీసిన 'బొంబే వెల్వెట్‌'లో తలేమిటో తోకేమిటో నాకు అర్థం కాలేదు. ఇక బసు బర్ఫీ అనే అద్భుతమైన సినిమా తీశాడు. ఈ సినిమాలో నా కొడుకును తీసుకున్నందుకు ఆనందమే. ఈ సినిమాతో నా కొడుకుకు గొప్ప గుర్తింపు వచ్చింది. కానీ, ఆ తర్వాత అతను 'గజ్జా జాసూసో'.. 'జగ్గాజాసూసో' ఓ సినిమా తీశాడు. ఇది కూడా పూర్తి గందరగోళంగా తీశాడు. ఈ ఇద్దరు దర్శకులు మరీ అతిగా తమ సినిమాలను ఊహించుకున్నారు' అని రిషీ అసహనం వెళ్లగక్కాడు. భారీ బడ్జెట్‌ సినిమాలు తీయాలన్న కోరికతో ఈ ఇద్దరు దర్శకులు తన కొడుకు కెరీర్‌ను దెబ్బతీశారని, భారీ బడ్జెట్‌ సినిమాలంటే వీరికి కోతుల చేతుల్లో బొమ్మలాగా మారిపోయిందని విమర్శించాడు. గతంలోనూ 'జగ్గా జాసూస్‌' సినిమా తీసిన అనురాగ్‌ బసుపై రిషీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు