17 రాష్ట్రాల్లో రూ. 150 కోట్లు దోచిన కోహ్లీ

30 Jun, 2016 20:21 IST|Sakshi

హైదరాబాద్: నగరంలో రైస్ పుల్లింగ్ పేరుతో దొంగ బాబా కోహ్లీ ముఠా ఏకంగా 17 రాష్ట్రాల్లో రూ. 150 కోట్లు దోచింది. యురేనియం, ఇరిడియం లాంటి లోహాలను వెలికి తీస్తామని చెబుతూ డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా కోట్ల రూపాయల వరకు కుచ్చుటోపి పెట్టింది. ‘రైస్ పుల్లింగ్ పాత్రను ఇంట్లో ఉంచుకుంటే డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుందనీ, ఈ పాత్రను ఒక్కసారి కొనుగోలు చేస్తే ఏళ్ల తరబడి లక్ష్మీదేవి కనికరిస్తుంది. కనకవర్షం కురిపిస్తుంది’ అంటూ ప్రధాన నిందితుడు దొంగ బాబా కోహ్లి నమ్మబలికాడు. అతడి మాయమాటలను నమ్మిన జూబ్లీహిల్స్‌కు చెందిన దామోదర్‌రెడ్డి అనే వ్యక్తి అడ్డంగా మోసపోయాడు.

దశలవారీగా రూ.4 కోట్లు ఆయన నుంచి కోహ్లీ బాబా వసూలు చేశాడు. దాంతో తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోసపోయిన వ్యక్తి డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేయగా.. కేసును సీఐడీకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీఐడీ ప్రత్యేక బృందం బెంగళూరులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిందితులు కోహ్లీ, గంగధారరెడ్డి, రమేష్ బాబు హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు