యప్ టీవీ ఇంటర్నెట్ టీవీ ప్రసారాలు ఇండియాలో ప్రారంభం

15 Oct, 2015 10:55 IST|Sakshi
యప్ టీవీ ఇంటర్నెట్ టీవీ ప్రసారాలు ఇండియాలో ప్రారంభం

ఇండియాలో యప్‌టీవీ ప్రసారాలను ప్రారంభించిన బ్రియన్ లారా
ఈ ఏడాది వ్యాపార లక్ష్యం 195 కోట్లు
దక్షిణాసియా దేశాలపై దృష్టి యప్‌టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి
 

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండియాలో ఇంటర్నెట్ టీవీ ప్రసారాలను యప్ టీవీ లాంఛనంగా ప్రారంభించింది. దీంతో 12 భాషల్లో 200కి పైగా చానల్స్ కార్యక్రమాలను ఎప్పుడైనా చూసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో యప్‌టీవీ ఇండియా ప్రసారాలను  వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ బ్రియన్ లారా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.టి.రామారావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యప్ టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ 5,000కు పైగా సినిమాలు, 100కుపైగా టీవీషోలతో పాటు, గత వారం రోజుల నాటి కార్యక్రమాలను మీకు నచ్చిన సమయంలో చూసుకోవచ్చన్నారు. ప్రస్తుతం 150కిపైగా దేశాల్లో యప్ టీవీ ప్రసారాలు అందుబాటులో ఉన్నాయని, రానున్న కాలంలో దక్షిణాసియా, స్పానిష్ దేశాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

విస్తరణ కార్యక్రమాల కోసం రూ. 325 కోట్లు (50 మిలియన్ డాలర్లు) సమీకరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ నిధుల సేకరణ చర్చల దశలో ఉందని, వచ్చే నాలుగైదు నెలల్లో ఇది పూర్తవుతుందన్నారు. ఇంత వరకు రూ. 72 కోట్లు (11 మి.డాలర్లు) సమీకరించినట్లు తెలిపారు. ఈ ఏడాది మరిన్ని దేశాలకు విస్తరించడంతో ఆదాయంలో రెట్టింపు వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గతేడాది రూ.104 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది రూ.195 కోట్లకు చేరవచ్చన్నారు. ఎలాంటి బఫరింగ్ లేకుండా టీవీ ప్రసారాలను చూసేలా టెక్నాలజీని అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడతూ వచ్చే మూడేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు