న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊహించినట్టుగానే దేశ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా పేదలు, చిన్న వ్యాపారులు, రైతులు, మహిళలకు, సీనియర్ సిటిజన్స్ కోసం ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించారు. శనివారం జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ ప్రభుత్వం రూపొందించిన కొత్త ప్రణాళికలు వెల్లడించారు. దేశంలో మహిళలు, ఉద్యోగినులు, పేదలు, బాగుపడినపుడే దేశం బాగుపడిందని ప్రకటించిన ప్రధాని గర్భవతులకు శుభవార్త అందించారు.
ముఖ్యంగా గర్భవతి మహిళల కోసం దేశ వ్యాప్త పథకాన్ని ప్రకటించారు. గర్భవతులకు చికిత్స, ప్రసవం, టీకాలు, పౌష్టికాహారం తదితర వైద్య ఖర్చుల కోసం నెలకు రూ.6 వేల ఇవ్వనున్నట్టు తెలిపారు. డైరెక్ట్ గా ఆయా మహిళల ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేయనున్నట్టు చెప్పారు. మాతా శిశు మరణాల నిరోధానికి ఈ పథకం బాగా ఉపయోగనుందన్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా 650 జిల్లాలో ఈ ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రధాని చెప్పారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గ్రామీణ ప్రాంతాల్లో 33 శాతం గృహనిర్మాణాలను పెంచనున్నామని మోదీ చెప్పారు. గ్రామీణులకు ఇంటి నిర్మించుకునేవారికి ప్రోత్సాహకాలందించిన మోదీ కొత్త ఇంటి నిర్మాణం లేదా ఉన్న ఇంటిలో కొత్త నిర్మాణాలు కోసం రుణ సౌకర్యం కల్పించనున్నామన్నారు. ఇందుకు గాను రూ. 2 లక్షల రూపాయల రుణాన్ని అందించనున్నారు. అలాగే ప్రధాని ఆవాస యోజన పథకం కింద గ్రామీణులకు రూ.9 లక్షలపైన రుణాలపై 4శాతం వడ్డీ మాఫీ,రూ.12లక్షలపై రుణాలపై 3శాతం వడ్డీమాఫీ చేయనున్నట్టు ప్రకటించారు.