లక్షా పాతిక వేల కోట్లు ఎన్నికల జిమ్మిక్కే!

19 Aug, 2015 13:55 IST|Sakshi
లక్షా పాతిక వేల కోట్లు ఎన్నికల జిమ్మిక్కే!

పాట్నా: బీమారీ బిహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్భాటంగా రాష్ట్రానికి లక్షా పాతిక వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం నిస్సందేహంగా ఎన్నికల జిమ్మిక్కే. మంగళవారం నాడు బిహార్‌లో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ‘మీకు యాభై వేల కోట్లు కావాలా, అరవై వేల కోట్లు కావాలా లేక 90 వేల కోట్ల రూపాయలు కావాలా?’ అని ప్రశ్నిస్తూ ఏకంగా లక్షా పాతిక వేల కోట్ల రూపాయలను ప్రకటించిన తీరు కూడా అందుకు దర్పణం.

అసలు ఇన్నివేల కోట్ల రూపాలను ఎలా విడుదల చేస్తారు? ఎప్పుడు విడుదల చేస్తారు ? ఎన్ని ఏళ్లలో విడుదల చేస్తారు ? అన్న విషయాలను మోదీ ప్రసంగం అనంతరం విడుదల చేసిన అధికార ప్రకటనలో కూడా ఎక్కడా వివరించలేదు. రోడ్లు, జాతీయ రహదారులకు 77 వేల కోట్ల రూపాయలు, మిగతా సొమ్ము రైల్వేల అభివృద్ది, విద్యుద్దీకరణ, ఇంధన వనరులకు ఖర్చు పెట్టనున్నట్టు వెల్లడించిన అధికారిక ప్రకటన ఏ పద్దుల కింద నిధులు విడుదల చేస్తారో చెప్పలేదు.

ప్రణాళికేతర వ్యయం కింద ఇన్ని వేల కోట్ల రూపాయలను విడుదల చేయడం ఏ కేంద్ర ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదనే విషయం ఆర్థిక నిపుణులకు తెల్సిందే. ప్రణాళికా వ్యయం కిందనే విడుదల చేయాలి. అలా చేయాలంటే కేంద్ర బడ్జెట్‌లో బిహార్ ప్రత్యేక ప్యాకేజీకి ప్రత్యేక కేటాయింపులు జరపాలి. ఆ కేటాయింపులు వచ్చే కేంద్ర బడ్జెట్‌లోనే విడుదల చేస్తారా, దఫ దఫాలు వరుస బడ్జెట్‌లో కేటాయిస్తారా? మొత్తం ఎన్ని బడ్జెట్లలో కేటాయిస్తారు ? ఇవన్ని ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే. వాటిని ఎన్నేళ్లలో ఎలా ఖర్చు చేయాలనే విషయంలో కూడా షరతులు విధిస్తారనే విషయం కూడా తెల్సిందే.

బిహార్‌లో వివిధ ప్రాజెక్టుల కింద గత 15 ఏళ్ల కాలంలో కేంద్రం కేటాయించిన 40 వేల కోట్ల రూపాయల్లో మూడొంతుల నిధులను ఇప్పటికీ ఖర్చు చేయలేక పోయింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అవి ఖర్చు కావాలి, కొత్త నిధులు విడుదల కావాలి. అందుకు ఎంతైన సమయం పట్టవచ్చు.

మాజీ సైనికులకు ‘ఒకే ర్యాంకు ఒకే పింఛను’ విధానాన్ని అమలు చేస్తామంటూ గత లోక్‌సభ ఎన్నికల బీజేపీ ప్రణాళికలో హామీ ఇచ్చినప్పటికీ మోదీ ప్రభుత్వం ఇప్పటికీ నిలబెట్టుకోలేక పోయింది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘ఒకే ర్యాంకు ఒకే పింఛను’ నినాదంతో మాజీ సైనికులు జరిపిన ర్యాలీని ఉద్దేశించి స్వయంగా మాట్లాడిన మోదీ ఖజానాపై ఏడాదికి దాదాపు పదివేల కోట్ల రూపాయల భారం పడుతుందని తెలిసి వెనకడుగు వేశారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు జంతర్ మంతర్ వద్ద తమ డిమాండ్ పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న మాజీ సైనికులపై మోదీ ప్రభుత్వం లాఠీలు ఝులిపించింది.

మాజీ సైనికుల కోసం కేవలం పదివేల కోట్ల రూపాయలను విదిలించేందుకు చేతులురాని మోదీ ఇప్పుడు బిహార్‌కు ఏకంగా లక్షా పాతిక వేల కోట్ల రూపాయలను ఉదారంగా ప్రకటించాలంటే ఎలా అర్థం చేసుకోవాలి? బీహార్‌కు ప్రత్యేక హోదా కల్సించాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మొదటి నుంచి మొత్తుకుంటున్నా హోదా సంగతి గాలికొదిలేసి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం ఎన్నికల జిమ్మిక్కు కాదా? అన్ని రంగాల్లో వెనకబడిన బిహార్‌ను పునరుద్ధరించి పురోగమనంలోకి తీసుక రావడం మామాలు విషయం కాదు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ కూడా పెద్దగా అభివృద్ధిని సాధించలేక పోయారు.

బిహార్ పరిస్థితి...
-భారత్‌లో కడు దారిద్య్ర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాల్లో బిహార్‌ది మూడవ స్థానం.
-నిరుద్యోగంతో బాధ పడుతున్న పేద రాష్ట్రాల్లో బిహార్‌ది మొదటి రాష్ట్రం.
-గ్రామీణ ప్రాంతాల్లో 98 శాతం కుటుంబాలకు సొంత మరుగు దొడ్లు లేవు. ఈ శాతం దేశంలోనే అతి పెద్దది.
-పేద రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలో రెండవ స్థానంలో ఉన్నది.
- అత్యధిక జనాభాగల రాష్ట్రాల్లో బిహార్‌ది మూడో స్థానం.

మరిన్ని వార్తలు