రష్యా రాయబారి దారుణహత్య

20 Dec, 2016 07:26 IST|Sakshi
టర్కీలో రష్యా రాయబారి ఆండ్రీ కార్లోవ్‌

మాస్కో: టర్కీలో ఓ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభకార్యక్రమంలో ప్రసంగిస్తున్న రష్యా రాయబారిని ఓ అనుమానిత ఉగ్రవాది కాల్చిచంపాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఆ వ్యక్తిని హతమార్చారు. ఈ ఘటన సోమవారం టర్కీలోని అంకారా సిటీలో జరిగింది. సిటీలో ఓ ఎగ్జిబిషన్ లో టర్కీలో రష్యా రాయబారి ఆండ్రీ కర్లోవ్‌ మాట్లాడుతుండగా వెనకనుంచి వచ్చిన ఆగంతకుడు గన్ తో ఆండ్రీపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు.

దీంతో ఆండ్రీ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపాక ఆ వ్యక్తి ‘అలెప్పో’, ‘రివెంజ్‌(ప్రతీకారం)’ అని అరిచిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. సిరియాలోని అలెప్పోలో తిరుగుబాటుదారుల అధీనంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనంచేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వసైన్యానికి టర్కీ, రష్యా సాయంచేస్తున్నాయి. కాగా, కాల్పులు జరిపిన వ్యక్తిని టర్కీ పోలీసుగా అంకారా నగర మేయర్‌ గుర్తించారు. ఈ ఘటనను ఉగ్రచర్యగా భావిస్తున్నట్లు మాస్కోలోని రష్యా విదేశాంగశాఖ ప్రకటించింది.

కాల్పులు జరిగిన ప్రాంతంలో కనిపించిన దృశ్యాలు

>
మరిన్ని వార్తలు