పసిపిల్లల ఆస్పత్రికి సచిన్ 10 లక్షల విరాళం

21 Jan, 2014 22:47 IST|Sakshi
పసిపిల్లల ఆస్పత్రికి సచిన్ 10 లక్షల విరాళం
హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న పిల్లలను ఆదుకోవడానికి బాయ్ జెర్భాయ్ వాడియా ఆస్పత్రికి పది లక్షల విరాళాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రకటించారు. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం చేపట్టనున్న 'లిటిల్ హార్ట్స్ మారథాన్' కార్యక్రమం సందర్భంగా ఆస్పత్రికి పది లక్షలు విరాళాన్ని ప్రకటిస్తున్నాను అని సచిన్ తెలిపారు.  హృదయ సంబంధమైన వ్యాధికి గురయ్యే పిల్లలకు అవగాహన కల్పించడానికి ముంబైలోని సిద్ధివినాయక్ ఆలయం నుంచి వాడియా ఆస్పత్రి వరకు మారథాన్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 9 తేదిన నిర్వహించనున్నారు. 
 
బాయ్ జెర్భాయ్ వాడియా పిల్లల ఆస్పత్రి కృషిని, డాక్టర్ యశ్వంత్ అంబేద్కర్ సేవలను సచిన్ కొనియాడారు. లిటిల్ హార్ట్స్ మారథాన్ కార్యక్రమం అవగాహన కల్పించడానికి, నిధుల సేకరణ కోసం చేపట్టామని సచిన్ వెల్లడించారు. తనకు తన గురువు అచ్రేకర్ ఎలానో.. భార్య అంజలికి అంబేద్కర్ కూడా గురువులాంటి వారని సచిన్ తెలిపారు. తన భార్య అంజలి డాక్టర్ రాణించడానికి అంబేద్కర్ సర్ చాలా తోడ్పాటును అందించారని సచిన్ తెలిపారు. ఈ ఆస్పత్రికి అంజలి వెంటిలేటర్ ను విరాళంగా అందించనున్నారు. 
 
ఓసారి ఈ ఆస్పత్రిని సందర్శించినపుడు ఓ అమ్మాయి వైద్య చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిందని.. అయితే డబ్బులు లేని కారణంగా ఆమె వైద్యం చేయించుకోలేకపోవడం తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని సచిన్ తెలిపారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం అమ్మాయికి డబ్బులున్నా.. వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో వ్యాధి ఉందన్నారు. వ్యాధితో బాధపడుతున్న పిల్లలను దక్కించుకోలేకపోవడం ఎంత దుర్భరమో ఓ తండ్రిగా తనకు జీర్ణించుకోలేనిదని సచిన్ ఆవేదన వ్యక్తం చేశారు. 
మరిన్ని వార్తలు