ఆ కారణాలను శాంసంగ్ కనిపెట్టేసింది..

19 Dec, 2016 13:44 IST|Sakshi
ఆ కారణాలను శాంసంగ్ కనిపెట్టేసింది..
సుదీర్ఘకాల విచారణ అనంతరం ఎట్టకేలకు దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ నోట్7 పేలుళ్ల కారణాలు కనిపెట్టేసింది. గెలాక్సీ నోట్7 పేలుడుకు గల మూల కారణాలను తాము కనుగొన్నామని శాంసంగ్ రిపోర్టు చేసింది. ఈ కారణాల రిపోర్టును కొరియా టెస్టింగ్ ల్యాబోరేటరీకి, ఇతర రెగ్యులేటరీ సంస్థలకు శాంసంగ్ సమర్పించింది. అయితే ఈ వివరాలను ఇంకా ప్రజలకు వెల్లడించలేదు.  పేలుళ్ల కారణాలను కనుగొన్నాం, వాటిని రెగ్యులేటరీకి సమర్పించామని మాత్రమే ఈ దక్షిణ కొరియా దిగ్గజం పేర్కొంది. గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో శాంసంగ్ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. గెలాక్సీ నోట్7 ఫోన్లలన్నింటినీ రీకాల్ చేసి సమస్యను పునరుద్ధరించుకుని మళ్లీ కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
 
అయినప్పటికీ ఆ సంస్థను పేలుళ్ల సమస్య వెన్నాడుతూనే ఉంది. దీంతో తమ ఫోన్లను వెనక్కిచేయలంటూ కంపెనీ ప్రకటించింది. పేలుళ్లకు అసలు మూల కారణాలేమిటో తెలుసుకోవడం కోసం ఓ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్ను కంపెనీ నియమించింది.  ప్రస్తుతం అంతర్గత విచారణ పూర్తయిందని, ఈ రిపోర్టులను బయట ల్యాబోరేటరీలకు పంపించామని శాంసంగ్ వెల్లడించింది.  ఎంతో ప్రతిష్టాత్మకంగా గెలాక్సీ నోట్7 ఫోన్ను శాంసంగ్ ప్రవేశపెట్టింది. కానీ ఈ ఫోన్కు పేలుళ్ల సమస్య తలెత్తడంతో ఎంతోకాలంగా కంపెనీ సాధించుకున్న ప్రతిష్ట మట్టిపాలైంది. చాలామంది గెలాక్సీ కస్టమర్లు ఇతర ఫోన్లకు తరలివెల్లారు. కంపెనీ త్రైమాసిక ఫలితాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. పేలుళ్ల సమస్య కనుగొనే వరకు గెలాక్సీ 8ను కూడా విడుదల చేయమని కంపెనీ జాప్యం చేస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ ఫిబ్రవరిలో ఉండే అవకాశముందని తెలుస్తోంది. 
 
మరిన్ని వార్తలు