సౌదీ రాయబారిపై ‘రేప్’ ఆరోపణలు

10 Sep, 2015 01:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇద్దరు నేపాల్ మహిళలపై గుర్గావ్‌లోని ఓ ఫ్లాట్‌లో భారత్‌లోని సౌదీ అరేబియా రాయబారి మహమద్ అల్సాటి, ఆయన సన్నిహితులు బుధవారం లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. తమను చంపుతామని బెదిరించి ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితులు బుధవారం ఫిర్యాదు చేశారు. ఇంట్లో పని చేయడానికి తాము వెళ్లగా రాయబారి కత్తులు చూపించి చంపుతామని బెదిరించారని చెప్పారు.

వీరి ఫిర్యాదుపై విచారణ నిమిత్తం రాయబారి ఇంట్లోకి వెళ్లడానికి పోలీసులు ప్రయత్నించడంతో సౌదీ అరేబియా అధికారులు, సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, పైగా సంప్రదాయాలను ఉల్లంఘించి పోలీసులు అక్రమంగా  రాయబారి ఇంట్లోకి ప్రవేశించారని సౌదీ రాయబార కార్యాలయం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లింది. మహమద్ అల్సాటి, అతని ఇద్దరు స్నేహితులు  విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లి పోలీసుల వ్యవహార తీరుపై నిరసనను వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు