ఎస్సీ, ఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఓకే

5 Aug, 2015 00:20 IST|Sakshi

ఆ వర్గాల వారిని వేధిస్తే కఠిన శిక్షలు
 
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై అమానవీయ నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు ఉద్దేశించిన ఎస్సీ/ఎస్టీ సవరణ బిల్లు-2014ను లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. సస్పెండైన 25 మంది కాంగ్రెస్ సభ్యులకు సంఘీభావంగా దాదాపు విపక్షాలన్నీ సభను బహిష్కరించగా మూజువాణి ఓటుతో బిల్లుకు పచ్చజెండా ఊపింది. ఎస్సీ, ఎస్టీలను మానవ, జంతు కళేబరాలను తీసుకెళ్లేలా, చేతులతో పారిశుద్ధ్య పనులు చేసేలా బలవంతం చేయడం తదితర నేరాలకు కఠిన శిక్ష విధించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. 1989 నాటి ఎస్సీ, ఎస్టీ(నేరాల నిరోధం) చట్టాన్ని సవరిస్తూ దీన్ని ప్రతిపాదించారు. ఇందులోని ఇతర ముఖ్యాంశాలు

ఈ నేరాల విచారణకు జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు, బాధితులకు పునరావాసం. చెప్పుల దండలు వేయడం, ఎస్సీ, ఎస్టీలను అందరిముందు కులం పేరుతో దూషించడం, వారిపై విద్వేషాన్ని ప్రచారం చేయడం, చనిపోయిన ప్రముఖులను అగౌరవించడం, సామాజికంగా, ఆర్థికంగా బహిష్కరించడం, బహిష్కరిస్తామని బెదిరించ డం నేరాల కింద పరిగణిస్తారు.ఎస్సీ, ఎస్టీలను ఒక అభ్యర్థికి ఓటేసేలా బలవంతం చేయడం, వారి భూములను అక్రమంగా లాక్కోవడం, ఆ వర్గాల మహిళలపై దాడి, లైంగిక దాడి, లైంగికోద్దేశంతో అనుమతిలేకుండా తాకడం, మాట్లాడ్డం, సైగలు చేయడం, వారిని ఆలయాలకు దేవదాసీలుగా మార్చడం, ఎస్సీ, ఎస్టీలను ప్రజా భవనాలు వాడుకోకుండా అడ్డుకోవడం, ఆలయాలు, స్కూళ్లు, ఆస్పత్రులకు రానివ్వకపోవడం కూడా నేరాలే.

బాధితులకు, వారిపై ఆధారపడిన వారికి, సాక్షులకు ప్రభుత్వం నుంచి రక్షణ. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి విధినిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఎస్సీ, ఎస్టీయేతర ప్రభుత్వోద్యోగికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష.
 

మరిన్ని వార్తలు