రాజధాని రూట్లో ఉద్యోగులు

7 Sep, 2013 02:30 IST|Sakshi

సాక్షి నెట్‌వర్క్: రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌లో శనివారం జరగనున్న ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సుకు హాజరయ్యేందుకు సీమాంధ్ర జిల్లాల నుంచి వేలాదిమంది ప్రభుత్వోద్యోగులు తరలివెళ్లారు. రోడ్డు, రైలు మార్గాల ద్వారా శనివారం ఉదయానికల్లా రాజధానికి చేరుకోనున్నారు. ఆర్టీసీ బస్సుల బంద్‌తో వందలాది ప్రైవేట్ బస్సులు, ట్రావెల్స్ వాహనాలను వారు అద్దెకు తీసుకున్నారు. ఇక  సీమాంధ్ర జిల్లాల మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్ చేరుకునే రైళ్లన్నీ శుక్రవారం ఉద్యోగులతో కిటకిటలాడాయి. కొంతమంది రెండురోజుల ముందుగానే హైదరాబాద్ చేరుకోగా, ఒక్క శుక్రవారం రోజునే వేలాదిమంది రాజధానికి బయలుదేరారు.
  ఒక్క గుంటూరుజిల్లా నుంచే పదివేల మందికి పైగా ఉద్యోగులు హాజరవుతున్నట్టు అంచనా. శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో జిల్లాకు చెందిన 500 మందికిపైగా ఉద్యోగులు సదస్సుకు బయల్దేరారు. గుంటూరు స్టేషన్ నుంచి రాత్రి 10.30 గంటలకు ప్రత్యేక రైలులో 2వేల మంది ప్రయాణమయ్యారు.
 
 ఇక శనివారం ఉదయం పిడుగురాళ్ల నుంచి సికింద్రాబాద్ వరకూ నడిచే ఎంఎంటీఎస్ రైల్లోనూ మరో 1200 మంది వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. విజయనగరం జిల్లా నుంచి గరీబ్థ్,్ర  విశాఖ, ఫలక్‌నుమా, గోదావరి  ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు నాలుగు బస్సుల ద్వారా సుమారు 2,500 మంది ఉద్యోగులు తరలి వెళ్లారు. విశాఖ జిల్లా నుంచి 3,750 మంది ఉద్యోగులు 28 ప్రత్యేక బస్సుల్లోనూ, మరో వెయ్యిమంది వివిధ రైళ్లలోనూ పయనమయ్యారు. ప్రకాశం నుంచి 3 వేల మంది, అనంతపురం నుంచి 5 వేల మంది, శ్రీకాకుళం జిల్లా నుంచి వేయి మంది, కృష్ణాజిల్లా నుంచి ఎనిమిది వేల మంది ఉద్యోగులు తరలివెళ్లినట్లు అంచనా.

మరిన్ని వార్తలు