భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

11 Jan, 2017 16:38 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు   బలంగా  ముగిశాయి. ప్రపంచ మార్కెట్లు  ప్రతికూలంగా ఉన్నప్పటికీ బ్యాంకింగ్, మెటల్  రంగాల మద్దతుతో మార్కెట్లు  భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు ఎగసి 27,140 వద్ద , నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 8,381 వద్ద స్థిరపడింది. ఇది రెండు నెలల గరిష్టంకాగా, మెటల్‌, బ్యాంకింగ్‌ దిగ్గజాలు మార్కెట్లకు జోష్‌నిచ్చాయి.  ఒక్క ఐటీతప్ప మిగిలిన  అన్ని రంగాలూ లాభాల్లో ముగిశాయి.  ముఖ్యంగా వడ్డీ రేట్లు తగ్గుతున్న కారణంగా రుణాలకు డిమాండ్‌ ఊపందుకుంటుందన్న అంచనాలతో బ్యాంక్‌ షేర్లు లాభాల దౌడు తీశాయి. బడ్జెట్‌ను అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రధానంగా మెటల్‌ 4.3 శాతం జంప్‌చేసింది.  2.3 శాతం  లాభపడిన బ్యాంక్‌ నిఫ్టీ జత కలవడంతో మార్కెట్లు పాజిటివ్ గా ముగిశాయి.
 జిందాల్‌ స్టీల్‌ , నాల్కో, హిందాల్కో, సెయిల్‌, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌,  భూషణ్‌ స్టీల్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌, వేదాంతా, హిందుస్తాన్‌ జింక్‌, ఎన్‌ఎండీసీ 6-1.6 శాతం మధ్య జంప్‌చేశాయి.   అలాగే ప్రయివేట్‌, ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు పుంజుకున్నాయి.  క్యూ3 ఫలితాల నేపథ్యంలో ఇండస్‌ఇండ్ 6.4 శాతం లాభపడగా.. బీవోబీ, యస్‌బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్, పీఎన్‌బీ, కెనరా, బీవోఐ,  కొటక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ, స్టేట్‌బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్  లాభాలను ఆర్జించాయి.    ప్రమోటర్ జెఎస్డబ్ల్యు సిమెంట్ షేర్ల అమ్మకాలకు ఆమోదం తెలపడంతో  శివం సిమెంట్  దాదాపు తొమ్మిదేళ్ల గరిష్టాన్ని తాకింది.     బజాజ్‌ఆటో, హెచ్‌సీఎల్ టెక్‌, ఐటీసీ, ఆర్‌ఐఎల్‌  స్వల్పంగా నష్టపోయాయి.
అటు డాలర్ మారకంలో రూపాయి 14  పైసలు నష్టపోయి రూ.68.32 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి  పది గ్రా. రూ.93  లాభంతో రూ. 28,237వద్ద ఉంది.
 

మరిన్ని వార్తలు