పద్మావతి చెలికాడు మారాడా!

13 Aug, 2016 20:52 IST|Sakshi
పద్మావతి చెలికాడు మారాడా!

దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తాజా చిత్రం 'పద్మావతి'తో నిజజీవిత ప్రేమపక్షులైన దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ మళ్లీ తెరపై  కనిపిస్తారని అందరూ భావించారు. బన్సాలీ దర్శకత్వంలో ఇప్పటికే ఈ జోడీ 'రామ్‌లీలా', 'బాజీరావు మస్తానీ' సినిమాల్లో నటించింది. ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ మ్యాజిక్ చేస్తుందని అంతా భావించారు. అయితే, తాజా అప్‌డేట్‌ ప్రకారం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి రణ్‌వీర్‌ సింగ్‌ తప్పుకున్నాడంట. రణ్‌వీర్‌ సింగ్‌ స్థానంలో కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌ నటించే అవకాశముందని తాజాగా బాలీవుడ్‌ వర్గాలు చెప్తున్నాయి. 
 
మేవాడ రాణి పద్మావతి జీవితకథ ఆధారంగా చారిత్రక ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పద్మావతిపై మనస్సుపడిన అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర కీలకమైనది. ఈ పాత్రలో నటించేందుకు ముందే తనకు స్ర్కిప్ట్ కాపీ ఇవ్వాలని దర్శకుడిని రణ్‌వీర్ కోరాడట. దీంతో నొచ్చుకున్న బన్సాలీ అతనిని తప్పించి మరొకరిని తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రేసులో షారుఖ్‌ ఖాన్‌ ముందంజలో ఉన్నారని, ఆయన ఒప్పుకొంటే దీపిక సరసన ఈ ప్రతిష్టాత్మక సినిమాలో కింగ్‌ ఖాన్‌ కనిపిస్తారని చిత్ర వర్గాలు చెప్తున్నాయి.   

ఇక పద్మావతి భర్తగా దీపిక సరసన షాహిద్ కపూర్ నటించనున్నారని సమాచారం.  పద్మావతి రాజా రావల్ రతన్‌సింగ్‌ పాత్రకు షాహిద్ సరిగ్గా సరిపోతారని దర్శకుడు బన్సాలీ భావించినట్టు బాలీవుడ్ వర్గాలు కథనం.

మరిన్ని వార్తలు