కన్నతల్లిని పీక కోసి చంపి.. రక్తాక్షరాలు!

24 May, 2017 16:31 IST|Sakshi
కన్నతల్లిని పీక కోసి చంపి.. రక్తాక్షరాలు!

దేశంలోనే అత్యంత సంచలనాత్మకమైన షీనాబోరా హత్యకేసును విచారిస్తున్న పోలీసు అధికారి భార్య హత్యకు గురయ్యారు. దాంతో ఒక్కసారిగా అందరికీ షాక్ తగిలినట్లయింది. ఈ కేసుకు, ఆమె హత్యకు ఏమైనా సంబంధం ఉందా అనుకున్నారు. కానీ, చివరకు ఆమె కన్న కొడుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. జ్ఞానేశ్వర్ గనోరే అనే ఇన్‌స్పెక్టర్ భార్య దీపాలి హత్యకు గురయ్యారు. అయితే ఆయన కొడుకు సిద్ధాంత్ గత రాత్రి నుంచి ఇంట్లో లేకుండా అదృశ్యం కావడంతో అతడిని ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. అతడి మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లిని పీక కోసి చంపేసిన అతడు.. ఆమె రక్తంతో ఇంట్లో నేలమీద ఒక స్మైలీ వేయడంతో పాటు.. ''ఆమె అంటే విసుగెత్తిపోయింది. నన్ను పట్టుకుని ఉరితీయండి'' అని రాశాడు.

గనోరే విధి నిర్వహణ ముగించుకుని బుధవారం తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. తాళాలు బూట్లు పెట్టుకునే ర్యాక్‌లో ఉన్నాయి. అతడు తలుపు తెరిచి చూసేసరికి తన భార్య దీపాలి రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేశారు. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రిలో ఉంచారు. పోలీసులు హత్యకేసు నమోదుచేసి, అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

సిద్ధాంత్ నేషనల్ కాలేజిలో ఇంజనీరింగ్ చదువును సగంలో ఆపేశాడు. గత రెండు నెలలుగా ఎవరితోనూ పెద్దగా కలవడం లేదని, అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండట్లేదని అతడి స్నేహితులు తెలిపారు. తల్లీ కొడుకుల మధ్య గొడవ ఏంటో తెలియదు గానీ, అతడు నాలుగైదు సార్లు కత్తితో పొడిచి, పీక కోసి మరీ కిరాతకంగా చంపాడు. పైగా తనను పట్టుకుని ఉరి తీయాలని కూడా రక్తంతో రాశాడు!

మరిన్ని వార్తలు