కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించారు. సోనియా గాంధీ చాలా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రతా బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్ జరుగుతుండగా, అందులో పాల్గొనకుండానే ఆమె బయటకు వెళ్లిపోయారు. కేంద్ర మంత్రి కుమారి షెల్జా, కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె ఉన్నట్టుండి బయటకు వెళ్లిపోయారు.
పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉన్న సోనియాను షెల్జా చేయి పట్టుకుని మరీ కారు వరకు తీసుకెళ్లారు. గత రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతున్న సోనియాగాంధీ, కేవలం ఆహార భద్రత బిల్లు కోసమే పార్లమెంటుకు హాజరయ్యారు. కానీ, ఓటింగ్ పూర్తయ్యే వరకు సభలో్ కూర్చోడానికి కూడా ఆమెకు ఓపిక లేకపోవడంతో షెల్జా, రాహుల్ దగ్గరుండి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ సోనియాకు వైద్యులు దగ్గరుండి చికిత్స చేస్తున్నారు.
67 ఏళ్ల సోనియాగాంధీని ఎయిమ్స్లోని కార్డియాలజీ విభాగంలో చేర్చారు. సభలో ఉండగా తనకు తీవ్ర అలసటగా ఉందని చెప్పడంతో ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. రాత్రి 8.15 గంటల సమయంలోనే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి షెల్జా కలిసి ఆమెను తీసుకెళ్లారు. ఎయిమ్స్ తాత్కాలిక డైరెక్టర్ ఆర్.సి. డేకా ఆమెకు స్వయంగా వైద్యం చేస్తున్నట్లు సమాచారం.