కాంగ్రెస్ ప్రచార సారథి సోనియానే

12 Feb, 2014 06:42 IST|Sakshi
కాంగ్రెస్ ప్రచార సారథి సోనియానే

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారానికి అందరూ అనుకుంటున్నట్టు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సారథ్యం వహించబోవడం లేదు. ఆ బాధ్యతను అధ్యక్షురాలు సోనియా గాంధీనే చేపట్టనున్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ 50 మంది నేతలతో ప్రచార కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సోనియా చైర్‌పర్సన్‌గా, రాహుల్ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తారని ఏఐసీసీ మంగళవారం విడుదల చేసిన ఆ కమిటీ సభ్యుల జాబితాలో తెలిపింది. అయితే ఇందులో సోనియా పేరు ప్రస్తావించకుండా.. ‘గౌరవ కాంగ్రెస్ ప్రెసిడెంట్.. చైర్‌పర్సన్‌గా, రాహుల్ గాంధీ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తారు’ అని మాత్రమే పేర్కొన్నారు. జాబితాలో మొత్తం 50 మంది పేర్లు ఉండగా.. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి జేడీ శీలంకు మాత్రమే చోటు కల్పించారు. జాబితాకు సోనియా ఆమోదముద్ర వేశారని పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ సంబంధిత ప్రకటనలో తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార బాధ్యతలు పూర్తిగా రాహుల్‌కే కట్టబెట్టాలని గత నెల 17న ఏఐసీసీ సమావేశానికి ముందు రోజు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో నిర్ణయించడం తెలిసిందే.
 
 జాబితాలో ముఖ్యులు..
 ప్రధాని మన్మోహన్‌సింగ్, మోతీలాల్ వోరా, ఏకే ఆంటోనీ, సుశీల్‌కుమార్ షిండే, అహ్మద్ పటేల్, జనార్దన్ ద్వివేది, పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్, ఆస్కార్ ఫెర్నాండెజ్, షీ లాదీక్షిత్, మొహిసినా కిద్వాయ్, అశోక్ గెహ్లాట్, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, సీపీ జోషి, మధుసూదన్ మిస్త్రీ, అజయ్ మాకెన్, ఆనంద్‌శర్మ, కమల్‌నాథ్, సల్మాన్ ఖుర్షీద్, జైరాం రమేశ్, అజిత్ జోగి, అమరీందర్ సింగ్, వి.నారాయణసామి, జ్యోతిరాదిత్య సింధియా, మనీశ్ తివారీ తదితరులు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు