భారీగా తగ్గిన సోనీ స్మార్ట్‌ ఫోన్ల ధరలు!

5 Sep, 2016 20:25 IST|Sakshi
భారీగా తగ్గిన సోనీ స్మార్ట్‌ ఫోన్ల ధరలు!

న్యూఢిల్లీ: సోనీ ఇండియా కంపెనీ తన టాప్‌ మొబైల్‌ ఫోన్ల ధరలను గణనీయంగా తగ్గించింది. సోనీ ప్రతిష్టాత్మక ఉత్పత్తులైన ఎక్స్‌పీరియా ఎక్స్‌, జెడ్‌ 5 ప్రీమియం ధరలను ఏకంగా 21శాతం వరకు తగ్గించింది. తగ్గిన ధరలు సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

సోనీ ఎక్స్‌పిరియా ఎక్స్‌ ధర మొదట్లో రూ. 48,990 ఉండగా, ఇప్పుడు రూ. 10వేలు తగ్గి రూ. 38,990కి చేరుకుంది. అదేవిధంగా ఎక్స్‌పిరియా జెడ్‌5 ప్రీమియం ధర రూ. 55,990 కాగా, దీని ధరలో 14శాతం కోతపెట్టింది. దీంతో ఎనిమిది వేలు తగ్గి రూ. 47,990కే ఇది లభిస్తోంది. భారత్‌లో ప్రీమియం కేటగిరి స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో సోనీ కంపెనీ సత్తా చాటుతోంది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ భారత్‌లో ఉంది. పరిశోధన సంస్థ ఐడీసీ ప్రకారం 2016 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ 17శాతం వృద్ధి సాధించింది. 2.75 కోట్ల మొబైల్‌ యూనిట్లు భారత్‌కు షిప్పింగ్‌ అయ్యాయి. అందులో ప్రధాన వాటా చైనా కంపెనీలు లెనోవో, షియోమి, వివోలదే. భారత్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో 25.1శాతం వాటాతో శామ్‌సంగ్‌ది ప్రథమ స్థానంలో  ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమాక్స్‌ (12.9శాతం), లెనోవో గ్రూప్‌ (7.7శాతం), ఇంటెక్స్‌ (7.1శాతం) ఉన్నాయి.  
 

>
మరిన్ని వార్తలు