ఏవియేషన్ శాఖ సరికొత్త నిర్ణయం

13 Aug, 2016 10:20 IST|Sakshi

న్యూఢిల్లీ :విమానప్రయాణికుల సమస్యల సత్వర పరిష్కార దిశగా  ఏవియేషన్ మంత్రిత్వశాఖ అడుగులు వేస్తోంది. విమానసంస్థలకు వ్యతిరేకంగా ప్రయాణికులు తమ ఫిర్యాదులను దాఖలు చేసేందుకు వీలుగా ఓ వెబ్సైట్ను లాంచ్ చేయాలని ఏవియేషన్ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఆ ఫిర్యాదులను విమానసంస్థలకు పంపించి, సత్వరమే సమస్య పరిష్కారం అయ్యేలా ఆ వెబ్సైట్ను రూపొందించనున్నారు.  ఏవియేషన్ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఆలోచన మేరకు ఈ ప్లాట్ఫాంను ఏర్పాటుచేయనున్నట్టు ఆ మంత్రిత్వశాఖ తెలిపింది.  విమానయానం చేసేటప్పుడు ఏదైన సమస్య ఎదురై మనోవేదనకు గురైనప్పుడు.. ఆ సమస్యను విమానసంస్థలకు తెలియజేయడానికి ఇప్పటివరకు సరియైన ప్లాట్ ఫామే లేదు. ఈ నేపథ్యంలో ఏవియేషన్ మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఏవియేషన్ మంత్రిత్వ శాఖ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లోని సభ్యులు ఈ ప్లాట్ఫాంను నిర్వహించనున్నట్టు సీనియర్ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా ఎవరన్నది తెలియరాలేదు. సోషల్ మీడియా లాంటి వివిధ సమాచార మాధ్యమాల ద్వారా విమానసంస్థలకు ఫిర్యాదులను అందిస్తున్న ప్రయాణికులకు, ఈ వెబ్సైట్ సమస్యల సత్వర పరిష్కారానికి ఓ ప్లాట్ఫామ్లాగా దోహదం చేయనుంది. ప్రయాణికులు ఫిర్యాదును విమానసంస్థలకు తెలియజేయాలనుకున్నప్పుడు.. ప్రయాణికుల ఏవియేషన్ అందించే ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయి, ఫిర్యాదును నమోదుచేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ ఫిర్యాదును విమానసంస్థకు పంపిస్తారు.  నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదును విమానసంస్థలు పరిష్కరిస్తాయి.

ఏవియేషన్ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని విమాన ప్రయాణికులు స్వాగతిస్తున్నారు. అయితే ప్రయాణికులు సమస్యలు తెలియజేయడానికి తమ దగ్గర సిస్టమ్స్ ఉన్నాయని విమాన సంస్థలు అంటున్నాయి. సోషల్ మీడియా సైట్ల ద్వారా సమస్యలు తెలుసుకుని, ఫిర్యాదులను పరిష్కృతం చేస్తున్నామని ఓ ఎయిర్లైన్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. దానికంటే ఎక్కువగా సమస్యల పరిష్కారానికి ఈ వెబ్సైట్ దోహదం చేయగలదా అని ప్రశ్నిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ప్లాట్ఫామ్ను ఏర్పాటుచేయడం అద్భుతమైన అడుగని ఎయిర్ ప్యాసెంజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు