ప్రత్యేక చిక్కులు!

10 Dec, 2014 00:31 IST|Sakshi
ప్రత్యేక చిక్కులు!

* ఏపీ, తెలంగాణతోపాటు చాలా రాష్ట్రాలు కోరుతున్నాయి
* రెండు రాష్ట్రాలకూ పరిశీలనలో పన్ను మినహాయింపు
* లోక్‌సభకు తెలిపిన కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, పన్ను మినహాయింపులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 94(1) ప్రకారం రెండు రాష్ట్రాలకు పన్ను మినహాయింపు అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్ లోక్‌సభలో వెల్లడించారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌లు అడిగిన ప్రశ్నకు ఆయన  సమాధానం ఇచ్చారు. పన్ను మినహాయింపును పరిశీలిస్తామన్న మంత్రి.. స్పెషల్ స్టేటస్‌పై ఆచితూచి స్పందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఒడిశా, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్లు ఉన్నాయని చెప్పారు.

‘జార్ఖండ్, ఒడిశా, రాజస్తాన్ రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ హోదా పొందేందుకు జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ) నిబంధనలు అంగీకరించటం లేదని కేంద్రం ఇప్పటికే తెలియచేసింది. బిహార్ విషయంలో కూడా నిబంధనలకు అనుగుణంగా లేదని ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్(ఐఎంజీ) పేర్కొంది’ అని వివరించారు.

ఎన్డీసీ నిబంధనల ప్రకారం స్పెషల్ కేటగిరీ హోదా దక్కాలంటే పర్వత శ్రేణులతో కూడుకున్న ప్రాంతం, తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభా ఎక్కువగా ఉం డడం, పొరుగు దేశాల సరిహద్దుల్లో ఉండడం, ఆర్థిక, మౌలికపరమైన వెనకబాటుతనం, ఆర్థిక చిక్కుల్లో ఉండడం లాంటి నిబంధనలను సంతృప్తి పరచాల్సి ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు