కష్టాల్లో ‘స్టెయిన్‌లెస్ స్టీల్’..!

6 Aug, 2013 02:59 IST|Sakshi
కష్టాల్లో ‘స్టెయిన్‌లెస్ స్టీల్’..!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టెయిన్‌లెస్ స్టీల్ పరిశ్రమకు ‘గట్టి’ కష్టాలే వచ్చిపడ్డాయి. దేశీయంగా ఈ లోహానికి భారీ డిమాండ్ ఉన్నా ఇక్కడి కంపెనీలు వ్యాపార అవకాశాలను అందుకోలేకపోతున్నాయి. దీనికి కారణం ముడిసరుకు ధరలు అంతకంతకూ పెరుగుతుండడం, నిపుణులైన  కార్మికుల కొరత, విద్యుత్ సరఫరాలో సమస్యలు. దీనికితోడు స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తులకు సరైన ధర రాకపోవడం, చైనా చవక ఉత్పత్తులు మార్కెట్లో రాజ్యమేలడం సమస్యను జటిలం చేస్తోంది. గత 10 ఏళ్లలో భారత్‌లో 3,000 పైగా చిన్నతరహా తయారీ యూనిట్లు మూతపడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
 
 తడిసి మోపెడు..
 పదేళ్ల క్రితం ముడి స్టెయిన్‌లెస్ స్టీల్ ధర కిలోకు రూ.60 ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.125-150 పలుకుతోంది. ఇంతకు చేరినా స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తుల ధర ఆశించిన స్థాయిలో పెరగడం లేదని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఉత్పత్తుల ధర కిలోకు సగటున రూ.250 పలుకుతోంది. వడ్డీ, విద్యుత్, వేతనాలు, మార్కెటింగ్ ఖర్చులు, అద్దెలు పోను మిగిలేది అంతంత మాత్రమేనని కంపెనీలు వాపోతున్నాయి. రాష్ట్ర కంపెనీలకైతే కరెంటు కష్టాలు వీడడం లేదు. ఇక దేశవ్యాప్తంగా ఈ రంగంలో సుమారు 50 వేల కంపెనీలున్నాయి. ఇందులో రాష్ట్రం నుంచి 100 దాకా ఉంటాయి. ముడి స్టెయిన్‌లెస్ స్టీల్ సరఫరా చేసే సెయిల్, జిందాల్ స్టీల్, టాటా స్టీల్‌లకు నగదు పూర్తిగా చెల్లిస్తేనే సరుకు పంపిస్తాయి. స్టీల్ ఉత్పత్తుల విషయంలో దుకాణదారుకు అరువు ఇవ్వాల్సి రావడంతో తయారీ కంపెనీలను కుంగదీస్తోంది. దేశీ కంపెనీలు రూ.20 వేల కోట్ల దాకా రుణాలు తీసుకున్నాయని ఇండియన్ స్టెయిన్‌లెస్ స్టీల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్(ఐఎస్‌ఎస్‌డీఏ) వెల్లడించింది.
 
 తయారీ అంతంతే..: హోటళ్లు, రెస్టారెంట్లు, గృహ విభాగంలో స్టెయిన్‌లెస్ స్టీలు ఉత్పత్తులకు గిరాకీ ఏమాత్రం తగ్గడం లేదు. శస్త్ర చికిత్స పరికరాలు(సర్జికల్స్) సైతం ఈ లోహంతో తయారవుతున్నవే. ఇంత డిమాండ్ ఉన్నా ప్లాంట్ల సామర్థ్యంలో 60-70%కి మించి ఉత్పత్తి జరగడం లేదని అగ్రోమెక్ ఇండస్ట్రీస్ పార్టనర్ దినేష్ సి జైన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. మొత్తం డిమాండ్‌లో దేశీ కంపెనీలు 80 శాతమే సమకూరుస్తున్నాయన్నారు. ఒక్కో కంపెనీ రోజుకు సగటున టన్ను స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, మలేషియా, కొరియా తదితర దేశాల్లో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ ఉంది. కొన్ని కంపెనీలే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి.
 
 చౌక ఉత్పత్తులు..
 చెన్నై వ్యాపారులు చౌక ధరలో ఫ్లాస్క్, కుకర్ల వంటి ఉత్పత్తులను పూర్తిగా చైనా నుంచి తెప్పిస్తున్నాయి. పన్ను భారం తక్కువగా ఉండడంతో కొన్ని కంపెనీలు పూర్తిగా తయారు కాని (అన్-ఫినిష్డ్) ఉత్పత్తులను దిగుమతి చేసుకుని వాటికి తుది మెరుగులు దిద్ది విక్రయిస్తున్నాయి. మరోవైపు తుక్కు స్టెయిన్‌లెస్ స్టీలు దిగుమతిపై ప్రభుత్వం 2.5 శాతం సుంకం విధించడాన్ని పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. కస్టమర్లు ధరే కాదు నాణ్యతను కూడా పరిగణించాలని ఇక్కడి కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. దేశంలో ఉత్పత్తుల వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 40%. ఇక తయారీలో యూపీలోని మురాదాబాద్, మహారాష్ట్రలోని వసై, భయందర్‌తోపాటు గుజరాత్, చెన్నైలు ప్రసిద్ధి. చైనా, తైవాన్, కొరియాల చౌక ఉత్పత్తులతో దేశీ పరిశ్రమ కుదేలవుతోందని ఐఎస్‌ఎస్‌డీఏ  ప్రెసిడెంట్ ఎన్.సి.మాథుర్ ఇటీవల చెప్పారు.
 
 అగ్రోమెక్ విస్తరణ..: స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తుల తయారీ కంపెనీ అగ్రోమెక్ త్వరలో ఖతార్‌లో ఔట్‌లెట్‌ను ప్రారంభించనుంది. అలాగే గుజరాత్‌లో జాయింట్ వెంచర్ ద్వారా భారీ ప్లాంటును నెలకొల్పాలని యోచిస్తోంది. రాష్ట్రంలో మరో 3 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ పార్టనర్ దినేష్ సి జైన్ తెలిపారు. ఫ్రాంచైజీకి తాము సిద్ధమని వెల్లడించారు. కంపెనీ హైదరాబాద్‌లో రెండు ఔట్‌లెట్లను 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్వహిస్తోంది.

మరిన్ని వార్తలు