ఆ స్టార్‌ కపుల్‌ మళ్లీ ఒకటవుతున్నారా!

22 Jan, 2017 18:26 IST|Sakshi
ఆ స్టార్‌ కపుల్‌ మళ్లీ ఒకటవుతున్నారా!

ముంబై: తమ పదమూడేళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ వాళ్లు విడాకులు తీసుకున్నారు. సామరస్యపూర్వకంగా వీడిపోయినా.. ఎదిగే తమ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు కలుస్తూ వచ్చారు. ఇప్పుడు మరింత సన్నిహితంగా ఒక్కటవుతారా? అన్నంత చేరువగా వచ్చారు. వారే మాజీ బాలీవుడ్‌ జంట హృతిక్‌ రోషన్‌. సుసానె ఖాన్‌. విడాకులు తీసుకున్న ఈ మాజీ దంపతులు కొడుకులు రెహాన్‌, హ్రిదాన్‌ కోసం ఇప్పటివరకు హుందాగా పరస్పరం సహకరించుకున్నారు. ఇటీవల హృతిక్‌ 43వ పుట్టినరోజుకు హాజరై సుసానె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వారి మధ్య అనుబంధం మళ్లీ రోజురోజుకు దృఢపడుతుండటం బాలీవుడ్‌ వర్గాలను, అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. గత ఏడాది కంగనా రనౌత్‌తో గొడవ, వరుస ప్లాఫులతో సతమతమవుతున్న హృతిక్‌ తన తాజా సినిమా ’కాబిల్‌’పై చాలా నమ్మకమే పెట్టుకున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌ స్క్రీనింగ్‌ ఇటీవల ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి హృతిక్‌ తో కలిసి సుసానె రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి మధ్య మళ్లీ చిగురిస్తున్న సానుకూల అనుబంధం మళ్లీ వీరు ఒక్కటవుతారా అన్న కథనాలకు తావిస్తోంది. విభేదాలతో వీడిపోయిన ఈ జంట మళ్లీ ఒకటై ఆనందంగా గడుపాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు