ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా డీఎస్

22 Aug, 2015 03:50 IST|Sakshi
ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా డీఎస్

సాక్షి, హైదరాబాద్: సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)ను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రిగా, రెండు పర్యాయాలు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన డీఎస్ ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. రాజకీయ, పాలనానుభవం ఉన్న డీఎస్ సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుందని ఇదివరకే పేర్కొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... ఈ మేరకు ఆయనకు అంతర్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతను అప్పగిస్తూ కేబినెట్ ర్యాంకుతో ఏడాది కాలానికి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించారు.

అధికార టీఆర్‌ఎస్‌లో చేరిన సమయంలో డీఎస్‌ను రాజ్యసభకు పంపిస్తారని, లేదంటే శాసన మండలికి పంపించి మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం  జరి గింది. అయితే ముందు నుంచీ డీఎస్ ముఖ్య సలహా దారు పోస్టుకే మొగ్గు చూపారని పార్టీ వర్గాల సమాచారం. ఆయన ఆశించినట్లుగానే ప్రత్యేక సలహాదారుగా నియమితులయ్యారు. కేబినెట్ హోదా పదవితో డీఎస్‌కు నెలకు లక్ష రూపాయల వేతనం, రూ.50 వేల ఇంటి అద్దె అలవెన్సు, కారు అద్దె, ఇందన ఖర్చుల కోసం రూ.45 వేలు చెల్లిస్తారు.
 
బంగారు తెలంగాణకు శ్రమిస్తా: డీఎస్
అంతర్ రాష్ట్ర సమస్యలు, వివాదాల పరిష్కారంలో సీఎం కేసీఆర్‌కు తోడుగా ఉంటానని డీఎస్ అన్నారు. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలు అప్పజెప్పారని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయనని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సహజంగానే ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉంటుందని, వాటి కోసం కృషి చేస్తానని అన్నారు. ఏ కారణంతో తాను టీఆర్‌ఎస్‌లో చేరానో, అదే దిశలో అడుగులు వేస్తానని, బంగారు తెలంగాణ సాధనకు శ్రమిస్తానని చెప్పారు.

>
మరిన్ని వార్తలు