రద్దయిన నోట్లు మిగిలిపోయాయా? అయితే..

26 Jan, 2017 14:18 IST|Sakshi
రద్దయిన నోట్లు మిగిలిపోయాయా? అయితే..

ముంబై: రద్దయిన పాత నోట్లు ఇంకా  మిగిలిపోయాయా?  రూ. 500, రూ.1000 నోట్లను  డిపాజిట్ చేయడం మర్చిపోయారా..అయితే అలాంటి వారికి నిజంగా లడ్డూ లాంటి వార్తే.  రద్దయిన ఈ పెద్దనోట్లను  మార్చుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుందట.  రూ. 500, రూ.1000 నోట్ల మార్పిడికి, బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు  మరో అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుందని జాతీయ మీడియా  గురువారం రిపోర్ట్ చేసింది.

పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ, బ్యాంకు అధికారుల వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఈ విషయాన్ని రిపోర్టు చేసింది. తమ దగ్గర మిగిలిపోయిన పెద్దనోట్ల డిపాజిట్ కు అనుమతించాల్సిందిగా కొంతమంది  కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంకుకు  లేఖ రాసినట్టు    పేర్కొంది. అయితే ఈ అవకాశాన్ని చాలా తక్కువ విలువ డిపాజిట్లకు పరిమితం చేయవచ్చని తెలిపింది.  ఈ పరిమితి సుమారు రూ.2వేలుగా ఉండొచ్చని తెలుస్తోంది.  

కాగా నవంబరు 8న దేశవ్యాప్తంగా రూ.500,1000 పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటన సంచలనం రేపింది.  ఈ నోట్లను బ్యాంకుల్లో మార్పడి  చేసేందుకు  కొన్ని పరిమితులను, ఆంక్షలను విధించింది. మరోవైపు పాత నోట్ల డిపాజిట్లకు గడువు  2016 డిసెంబర్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు