సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని వినిపించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎంతమంది సంతృప్తిగా ఉన్నారో తనకు తెలియదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఇండియా టుడే దక్షిణాది సదస్సు-2017లో ముచ్చటించిన ఆయన జాతీయగీతం, బీఫ్ నిషేధం సహా పలు అంశాలపై స్పందించారు. 'హలాల్ చేసినదైతే బీఫ్ తినడానికి నేను ఇష్టపడుతా. దీనితో ప్రభుత్వాలకు ఏం సంబంధం?' అని ఆయన ప్రశ్నించారు. ముస్లిం యువతలో అతివాద భావజాలం పెరిగిపోవడంపై స్పందిస్తూ అది ఆందోళనకరమని అన్నారు. రాడికలైజేషన్ ఏ మతంలో ఉన్నా అది ఆందోళనకరమేనని వ్యాఖ్యానించారు.
అప్పుడు ఇస్లాం కూడా జీవన విధానమే..!
లౌకికవాదం గురించి మాట్లాడుతూ.. 'హిందువులు చాలావరకు సెక్యులర్గా ఉంటారు. కానీ బాగా మాట్లాడగలిగే ఓ వ్యక్తి వారిని తనవైపు తిప్పుకొన్నాడు. అందుకు కారణం బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ అడ్డులేకపోవడమే' అని పేర్కొన్నారు. హిందుత్వాన్ని సుప్రీంకోర్టు ఒక జీవన విధానంగా గుర్తించినప్పుడు.. ఇస్లాం, క్రైస్తవ మతాలు కూడా ఎంతోమందికి జీవనవిధానాలేనని పేర్కొన్నారు. 'రిజన్, రిలీజియన్, ఐడెంటిటీ: కీపింగ్ ఇండియా ఫస్ట్' అన్న అంశంపై చర్చలో డీఎంకే ఎమ్మెల్యే త్యాగరాజన్, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ గౌడతో కలిసి ఒవైసీ పాల్గొన్నారు.