శశికి కేసుల ఉచ్చు.. సుప్రీం తాజా అప్‌డేట్‌!

9 Feb, 2017 19:40 IST|Sakshi
శశికి కేసుల ఉచ్చు.. సుప్రీం తాజా అప్‌డేట్‌!

న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు పావులు కదుపుతున్న వీకే శశికళను అక్రమాస్తుల కేసు వెంటాడుతున్నది. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ కూడా నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరిస్తుందని అందరూ భావించారు. ఈ తీర్పు ప్రతికూలంగా వస్తే.. శశికళకు సీఎం పదవి చేపట్టే చాన్స్‌ ఉండదని అనుకున్నారు. అయితే, సుప్రీంకోర్టు శుక్రవారం లిస్టింగ్‌లో ఈ కేసు నమోదుకాలేదు. దీంతో ఈ కేసులో వచ్చేవారం తీర్పు వెలువడే అవకాశముందని భావిస్తున్నారు.

అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలితతోపాటు శశికళను, ఆమె కుటుంబసభ్యులను కర్ణాటకలోని దిగువ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును జయలలిత సవాల్‌ చేయడంతో కర్ణాటక హైకోర్టు దీనిని కొట్టేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ క్రమంలో జయలలిత మరణించడం, ఆమె నెచ్చెలి అయిన శశికళ అన్నాడీఎంకే అధినేత్రిగా ఎన్నికకావడమే కాకుండా.. సీఎం పదవి కోసం సిద్ధమవుతుండటంతో సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వారంలోనే ఈ కేసులో తీర్పు వెలువరిస్తామని గతంలో సుప్రీంకోర్టు సంకేతాలు ఇచ్చింది. అయితే, శుక్రవారం ఈ కేసు లిస్టింగ్‌ కాకపోవడంతో వచ్చేవారం తీర్పు రావొచ్చునని భావిస్తున్నారు.

 



 చదవండి :
శశికళకు ఎదురుతిరిగిన 20మంది ఎమ్మెల్యేలు?
 

మరిన్ని వార్తలు