మెట్రో స్టేషన్‌లో తాప్సీ చేసిన సాహసం!

21 Aug, 2016 11:10 IST|Sakshi
మెట్రో స్టేషన్‌లో తాప్సీ చేసిన సాహసం!

నిన్నమొన్నటివరకు 'సాహసం', 'మొగుడు' వంటి తెలుగు సినిమాలు చేసిన తాప్సీ పన్ను 'బేబీ' సినిమాతో బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటున్న ఆమె ప్రస్తుతం 'పింక్‌' సినిమాలో నటిస్తోంది. ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఆమెకు ఇటీవల అనూహ్య అనుభవం ఎదురైంది.

తాప్సీ రోజూ షూటింగ్‌ కోసం మెట్రోరైలులో వెళుతుంది. ఓ రోజు ఆమె షూటింగ్‌ ముగించుకొని ఇంటికి బయలుదేరింది. మెట్రో స్టేషన్‌లో దిగి తన కారు దగ్గరకు వెళుతుండగా.. ఓ అమ్మాయిని చుట్టుముట్టి ఆకతాయిలు వేధిస్తుండటాన్ని గమనించింది. వెంటనే మరో ఆలోచన లేకుండా ఆ అమ్మాయి దగ్గరికి తాప్సి పరిగెత్తుకెళ్లింది. అసభ్య ప్రేలాపనలు చేస్తున్న ఆకతాయిల నుంచి ఆ అమ్మాయిని కాపాడి.. సురక్షితంగా ఇంటికి చేర్చింది.

ఈ ఘటన గురించి తాజాగా తాప్సీ వివరించింది. 'మెట్రో స్టేషన్‌ నుంచి నా కారు దగ్గరకు వెళుతుండగా కొందరు వ్యక్తులు ఒంటరిగా ఉన్న అమ్మాయిపై ప్రేలాపనలు చేస్తున్నారు. నేను వెంటనే ఆ అమ్మాయికి దగ్గరికి వెళ్లాను. మీరు ఎక్కడికి వెళ్లాలో చెబితే అక్కడ నా వాహనంలో డ్రాప్‌ చేస్తానని చెప్పాను. నేనెవరో తెలియకపోయినా.. అందుకు ఆ అమ్మాయి ఒప్పుకొంది. ఇది నాకు ఆనందం కలిగింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత కృషి చేయాలి' అని  తెలిపింది.

షూజిత్ సర్కార్ తాజా చిత్రం 'పింక్‌'లో తాప్సీ రేప్ బాధితురాలిగా కనిపిస్తోంది. ముగ్గురు మహిళలు ఎలా ట్రాప్ చేయబడి ఒక కేసులో చిక్కుకున్నారు? వారు ఎలా బయటపడ్డారు? అన్నది ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్, కిర్తీ కుల్హరి తదితరులు నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు