లాహోర్: పాకిస్థాన్లోని లాహోర్ నగరంలో తాలిబన్లు చట్టవిరుద్ధంగా నడుపుతున్న టెలిఫోన్ కాల్ సెంటర్పై మంగళవారం స్థానిక పోలీసులు దాడి చేశారు. తాలిబన్లు తాము కిడ్నాప్ చేసిన వారి కుటుంబ సభ్యులకు ఇక్కడి నుంచే పెద్ద సంఖ్యలో ఫోన్లు చేసేవారు. గ్రీన్టౌన్ ప్రాంతంలోని ఓ ఇంటి నుంచి నడుపుతున్న ఈ టెలిఫోన్ ఎక్స్ఛేంజిపై దాడి సందర్భంగా ఒక మహిళతోపాటు ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు
. పేలుడు పదార్థాలు, ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ, దివంగత పంజాబ్ మాజీ గవర్నర్ సల్మాన్ తసీర్ల తనయులను కిడ్నాప్ చేసిన తాలిబన్లు ఈ సెంటర్ నుంచే వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి భారీ మొత్తంలో డబ్బు ఇస్తేనే బందీలను విడిచిపెడతామని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. సెంటర్ నుంచి అఫ్ఘానిస్థాన్ తదితర పొరుగు దేశాలకు కూడా కాల్స్ నడిచేవన్నారు.
పాక్ మదర్సాపై అమెరికా ఆంక్షలు
ఇస్లామాబాద్/వాషింగ్టన్: పాక్లోని షెషావర్లో ఉన్న జామియా తలీముల్ ఖురాన్ వల్ హదిత్ మదర్సాతో తమ దేశస్తులు ఎలాంటి వ్యవహారాలు నడపొద్దని అమెరికా ఆంక్షలు విధించింది. ఇది ఉగ్రవాద సంస్థ అని, బాంబు తయారీదారులకు, ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇస్తోందని ప్రకటించింది. అమెరికా ఒక మదర్సాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ మదర్సా అధిపతి షేక్ అమీనుల్లాను ఐక్యరాజ్య సమితి, అమెరికాలు 2009లోనే ఉగ్రవాదిగా ప్రకటించాయి.