కామెడీ షోలో ఆ నటిపై దారుణమైన జోక్స్‌!

28 Sep, 2016 16:17 IST|Sakshi
కామెడీ షోలో ఆ నటిపై దారుణమైన జోక్స్‌!

మన టీవీల్లో వచ్చే కామెడీ షోల్లో దారుణమైన కుళ్లు జోకులు వేసి నవ్వించేందుకు కుప్పిగంతులు వేయడాన్ని మనం చూసే ఉంటాం. తాజాగా బాలీవుడ్‌ నటి తనిష్టా ఛటర్జీకి ఇదేవిధమైన చేదు అనుభవం ఎదురైంది. గ్రామీణ స్త్రీల సమస్యలపై సాహసోపేతంగా తెరకెక్కిన ’పర్చెడ్‌’  సినిమాలో రాధికా ఆప్తేతో కలిసి ఆమె బోల్డ్‌గా నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకురాలు లీనా యాదవ్‌, సహనటి రాధికా ఆప్తేతో కలిసి ’కామెడీ నైట్స్‌ బచావో’ షోలో ఆమె పాల్గొన్నది. ఈ షోలో 'రోస్ట్‌' (ఆరోగ్యకరమైన జోక్స్‌) పేరిట ఆమె నల్లగా ఉన్నదని హేళన చేశారు. 'మీకు చిన్నప్పటి నుంచి నల్లరేగడి పళ్లు ఇష్టమా? మీరు అవి బాగా తిని ఉంటారు కదా' అంటూ  ఆమె ఒంటిరంగును హేళన చేస్తూ కుళ్లు జోకులు వేశారు. దీంతో కంగుతిన్న ఆమె వెంటనే నిరసన తెలిసింది.

మనుషుల రూపురేఖలని చులకన చేసే వ్యాఖ్యలతో పరిహాసమాడటం ఏమీ బాగా లేదని ఆమె షో నుంచి వైదొలిగింది. దేశవ్యాప్తంగా ప్రసారమయ్యే ఓ కామెడీ షోలో ఇంత దారుణంగా జోక్స్‌ వేయడం తనను షాక్‌కు గురిచేసిందని ఆమె తన ఫేస్‌బుక్‌ పేజీలో తెలిపారు. అసభ్యకరమైన పరిహాసాలు చేసినందుకు కామెడీ షో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒంటిరంగు కారణంగా మన దేశంలో చాలామందికి ఉద్యోగాలు రావడం లేదని, పెళ్లి ప్రకటనల్లోనూ శరీర ఛాయ ప్రధానపాత్ర పోషిస్తున్నదని, దేశంలోని కులవ్యవస్థ మూలాల్లోనే ఈ వర్ణ వివక్ష కూడా ఉందని ఆమె విశ్లేషించారు.  
 

>
మరిన్ని వార్తలు